నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలు

ABN , First Publish Date - 2023-09-26T04:41:52+05:30 IST

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలైంది. సోమవారం రాజస్థాన్‌లోని నైరుతి ప్రాంతం నుంచి నిష్క్రమించాయి. సాధారణంగా సెప్టెంబరు 17 నుంచి రుతుపవనాల ఉపసంహరణ మొదలుకావాలి.

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలు

ఆగస్టులో వందేళ్ల కాలంలో అతి తక్కువ వర్షపాతం నమోదు

విశాఖపట్నం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలైంది. సోమవారం రాజస్థాన్‌లోని నైరుతి ప్రాంతం నుంచి నిష్క్రమించాయి. సాధారణంగా సెప్టెంబరు 17 నుంచి రుతుపవనాల ఉపసంహరణ మొదలుకావాలి. కానీ ఈ ఏడాది ఆలస్యమైంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో పొడి వాతావరణం నెలకొనడం, గడచిన ఐదు రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో నిష్క్రమణపై సోమవారం వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఏడాదిలో కురిసే వర్షపాతంలో సుమారు 70 శాతం నైరుతి రుతుపవనాల సీజన్‌లోనే నమోదవుతుంది. ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీన కేరళలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా ఎనిమిదో తేదీన వచ్చాయి. కానీ, ఎల్‌నినో ప్రభావంతో జూన్‌, ఆగస్టు నెలల్లో వర్షాభావం నెలకొంది. జూలైలో మాత్రం దేశవ్యాప్తంగా మిగులు వర్షపాతం నమోదైంది. ఇక... ఆగస్టులో వందేళ్ల కాలంలో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడం ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అయితే సెప్టెంబరులో కొంతమేర వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పంటలకు ఊపిరివచ్చింది. కాగా, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా, ఛత్తీ్‌సగడ్‌ మీదుగా తెలంగాణ వరకు, ఛత్తీ్‌సగడ్‌ నుంచి మహారాష్ట్ర మీదుగా కొంకణ్‌ తీరం వరకు వేర్వేరు ద్రోణులు విస్తరించాయి. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల సోమవారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2023-09-26T04:41:52+05:30 IST