శంషాబాద్ను కమ్మేసిన పొగమంచు!
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:31 AM
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో సోమవారం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పలు జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను దారి మళ్లించారు.
వాతావరణం అనుకూలించక పలు విమానాల దారిమళ్లింపు
గన్నవరం, బెంగళూరుకు తరలింపు
ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు
శంషాబాద్ రూరల్/గన్నవరం, డిసెంబరు 25 (ఆంరధజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో సోమవారం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పలు జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను దారి మళ్లించారు. ఉదయం 6 గంటల నుంచి ఎయిర్పోర్టును పొగమంచు కప్పేసింది. మస్కట్, రియాద్, జెద్దా నుంచి వచ్చిన విమానాలను బెంగళూరు మళ్లించారు. అలాగే ముంబై నుంచి వచ్చిన విమానాలను గన్నవరం, నాగ్పూర్ ఎయిర్పోర్టులకు తరలించారు. ఇక్కడ దిగాల్సిన ప్రయాణికులు వేరే విమానాశ్రయాల్లో దిగాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్క గన్నవరంలోనే మూడు విమానాలు ల్యాండ్ అయ్యాయి. వీటిలోని దాదాపు 500 మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పొగ మంచు తీవ్రత తగ్గిన తర్వాత శంషాబాద్ నుంచి విమానాల రాకపోకలు కొనసాగాయి. విమానాశ్రయం ప్రారంభం నాటి నుంచి ఈ స్థాయిలో పొగమంచు కురవడం ఇదే తొలిసారని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఇటు విమానాశ్రయ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపైనా పొగమంచు కమ్మింది. దీంతో ఉదయం 9 గంటల వరకు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.