‘సత్యసాయి’ వైసీపీలో ముసలం
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:35 AM
అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ముసలం పుట్టింది.
సిటింగ్ల మార్పు సంకేతాలతో అసంతృప్తి జ్వాలలు
పెనుకొండలో పోటీచేస్తున్నాననిమంత్రి ఉషశ్రీచరణ్ ప్రకటనపై ఆగ్రహం
పుట్టపర్తి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ముసలం పుట్టింది. శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ, కదిరి, మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యేలు శంకరనారాయణ, సిద్దారెడ్డి, తిప్పేస్వామిని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. వారి స్థానాల్లో మార్పు చేసి, కొత్తవారిని నియమిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు తాను పెనుకొండ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీచరణ్ గురువారం ప్రకటించడంతో అసంతృప్తి మంటలు రాజుకున్నాయి. తాడేపల్లికి వెళ్లి వచ్చిన ఎమ్మెల్యే శంకరనారాయణ పెనుకొండలోని తన నివాసంలో నియోజకవర్గ నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని వైసీపీ నేతలతోపాటు పెనుకొండ నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ఫారూక్, కౌన్సిలర్లు సమావేశమయ్యారు. శంకర్నారాయణను కాదని ఉషశ్రీచరణ్ను అభ్యర్థిగా నిలిపితే తమ దారి తాము చూసుకుంటామని స్పష్టం చేశారు. కదిరిలో సిటింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని కాదని మక్బూల్ బాషాను నియమిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కదిరిలో 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు మూకుమ్మ్డడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.