వందేభారత్ కోసం.. రైళ్లు బలి!
ABN , First Publish Date - 2023-09-22T03:58:17+05:30 IST
వందేభారత్ రైళ్లు మనకు ఎప్పుడొస్తాయా అని విజయవాడ జంక్షన్ ఇన్నాళ్లూ ఎదురుచూసింది. తీరా అవి వచ్చాక వాటి దెబ్బకు ఎందుకీ తలనొప్పి అంటూ బాధపడుతోంది.
గతంలో వందేభారత్ కోసం ఎదురుచూపులు
వచ్చాక ఇతర రైళ్లు రద్దు చేయాల్సిన దుస్థితి
వందేభారత్ రైళ్ల క్లియరెన్ ్స కోసం తంటాలు
రైల్వే సేఫ్టీ వర్క్స్ అని చెబుతున్న అధికారులు
(ఆంధ్రజ్యోతి - విజయవాడ )
వందేభారత్ రైళ్లు మనకు ఎప్పుడొస్తాయా అని విజయవాడ జంక్షన్ ఇన్నాళ్లూ ఎదురుచూసింది. తీరా అవి వచ్చాక వాటి దెబ్బకు ఎందుకీ తలనొప్పి అంటూ బాధపడుతోంది. వందేభారత్ రైళ్లను సజావుగా నడపడానికి మిగిలిన రైళ్లను రోజుల తరబడి రద్దు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకటి రెండు సందర్భాలు తప్ప ఇటీవల రైళ్లను రద్దు చేయడానికి వందేభారత్ రైళ్లే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.! విజయవాడ జంక్షన్లో మూడు, నాలుగు నెలలుగా క్రమం తప్పకుండా రైళ్ల రద్దుల పర్వం కొనసాగుతోంది. నాన్ ఇంటర్ లాకింగ్ వర్క్స్, రైల్వే ట్రాక్ సేఫ్టీ వర్క్స్, థర్డ్ లైన్ కమిషన్ వర్క్స్.. అంటూ రైల్వే అధికారులు కారణాలు చెబుతున్నారు. ఒక సెక్షన్లో ఒకే తరహా రైళ్లను రద్దుచేస్తే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో.. ఒక్కో వారం ఒక్కో రూట్లో రైళ్లను రద్దు చేస్తున్నారు. దీనికి ఒడిసాలో జరిగిన బాలాసోర్ దుర్ఘటన పేరు చెప్పి భద్రత మీద ఎక్కువుగా దృష్టి సారిస్తున్నామని చెబుతున్నారు. రోలింగ్ బ్లాక్ కారిడార్ రిపేర్ వర్క్స్, ట్రాక్ మెయింటెనెన్స్, బ్లాక్ స్పాట్ గుర్తింపు అంటూ మీడియాకు చెబుతున్నారు. ఒకవేళ రైల్వే అధికారులు చెబుతున్నట్టు ఈ పనులు చేపట్టినా.. వాటికీ, రైళ్లు ఆగిపోవ డానికి సంబంధం లేదు. విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్కు కూత వేటు దూరంలో లోబ్రిడ్జి మీద రైల్వే ట్రాక్స్ను పూర్తిగా మార్చివేయడానికి భారీ పనులు చేపట్టినప్పుడు ఒక్క రైలు కూడా ఆగలేదు. ఒక లైన్ మీద పను లు చేపడితే మరో లైన్పై రైళ్లు నడిపించారు తప్ప ఒక్క సర్వీస్ను కూడా రద్దు చేయలేదు. గతంలో పలుమార్లు ఇంటర్ లాకింగ్ పనులు చేసినా.. ఈ స్థాయిలో ఎప్పుడూ ఆగలేదు. వాస్తవానికి రైళ్ల రద్దుకు అసలు కారణం వందేభారత్ ఎక్స్ప్రెస్లు. వీటిని సికింద్రాబాద్ వయా విజయవాడ, విశాఖపట్నం రూట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఇబ్బందులు తలెత్తా యి. ఆ తర్వాత సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో మరో వందే భారత్ను ప్రవేశపెట్టారు. ఈ రెండు రైళ్ల వల్ల అత్యంత ఈ జంక్షన్పై తీవ్ర ప్రభా వం పడుతోంది. వందేభారత్ను నిరాటంకంగా నడిపించడానికి మిగిలిన రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. అనుమతించిన మేరకు వందేభారత్ రైలు గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సికింద్రా బాద్-విశాఖపట్నం మధ్య దీనికి కేవలం 4 స్టాప్లు ఉంటాయి. ఈ వందే భారత్ రైలు ఒక రైల్వేస్టేషన్లో ఉంటే దాని తర్వాతి నాలుగు స్టేషన్ల పరిధిలో ఎలాంటి రైళ్లూ నిలిపి ఉంచడానికి వీలు లేదు. వందేభారత్ వెళ్లే వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఇలా వందేభారత్ ఒక స్టేషన్ దాటితే.. అక్కడి నుంచి మరో 4 స్టేషన్లలో రైళ్ల నిలుపుదల చేయకుండా క్లియర్ చేయాల్సి వస్తోంది. ఇలా చేయడం దుర్లభం కావడంతో అనేక రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. వాస్తవానికి రైళ్లు సమయానుకూలంగా నడవవు. కొన్ని ఆలస్యం అవుతుంటాయి. దానికితోడు సాంకేతిక సమస్య లూ వ స్తుంటాయి. ఇలాంటి సందర్భంలో ఒక్క రైలు ఆగినా ఆ ప్రభావం అనేక రైళ్లపై పడుతుంది. మొదట్లో ఈ కారణాలతోనే వందేభారత్ రైళ్లు ఆలస్యంగా నడిచేవి. దీంతో రైల్వేపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో రైల్వే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్కు చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు, అవి సమయానుకూలంగా నడవడానికి వాటికి అధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. దీంతో వందేభారత్ రైళ్ల రాకపోకల కోసం మిగిలిన రైళ్ల నడపలేక రద్దు చేస్తున్నారు. వందేభారత్ నిర్వహణ కోసం రైళ్లను రద్దు చేయాల్సి వస్తోందన్న కారణంతో రైల్వే అధికారులు డి విజన్ పరిధిలో తరచూ ఇతర రైళ్లు ఆగాల్సిన స్టేషన్ల హాల్ట్లను రద్దు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రయాణికులు పెద్దగా ఉండటం లేదన్న పేరుతో మెల్లగా పలు స్టేషన్లనే మూసివేశారు. అయినా లాభం లేకపోవడంతో రైళ్లను రద్దు చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది.