కాఫర్ డ్యాంలు పూర్తికాకముందే డయాఫ్రం వాల్ కట్టారు
ABN , First Publish Date - 2023-07-21T02:55:52+05:30 IST
డయాఫ్రం వాల్ కొత్తది నిర్మించాలా.. లేక పాతదానికే మరమ్మతులు చేయాలా అన్నదానిపై ఈ నెల 10న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం మినిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) కె.నరసింహమూర్తి తెలిపారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి పోలవరం ఎస్ఈ వివరణ
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): డయాఫ్రం వాల్ కొత్తది నిర్మించాలా.. లేక పాతదానికే మరమ్మతులు చేయాలా అన్నదానిపై ఈ నెల 10న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం మినిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) కె.నరసింహమూర్తి తెలిపారు. ‘కట్టలేక కూల్చుడు’ శీర్షికన 14న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. డయాఫ్రం వాల్ ప్రణాళికకు అనుగుణంగా.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం తర్వాతే వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని.. దీనికి భిన్నంగా కాఫర్ డ్యాంలు పూర్తికాకుండానే డయాఫ్రం వాల్ను 2017లో ప్రారంభించి.. 2018లో పూర్తి చేశారని తెలిపారు. 2019, 20ల్లో వచ్చిన వరదలకు ఈ ఖాళీల నుంచి ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాం ప్రాంతంలో నిర్మించిన వాల్ దెబ్బతిందని చెప్పారు. వరదల కారణంగానే నష్టం జరిగిందని.. సీఎం జగన్ తప్పిదాలు కారణం కాదని స్పష్టం చేశారు. గైడ్బండ్ కుంగిపోవడానికి చౌడు నేలే కారణమని కేంద్ర జలశక్తి శాఖ ఐసీఐడీ సెక్రటరీ జనరల్ ఏబీ పాండ్యా ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ తేల్చిందని వివరించారు. రివర్స్ టెండరింగ్లో పనులు అప్పగించడం వల్ల రూ.845 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు.