Polavaram project : ఇంకెప్పుడు!

ABN , First Publish Date - 2023-06-02T04:09:36+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ‘వాయిదాల వలయం’లో చిక్కుకుంది. ప్రాజెక్టు పూర్తి లక్ష్యాన్ని జగన్‌ సర్కారు ఏటేటా పొడిగించుకుంటూ పోతోంది. మొన్నటిదాకా 2024 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని చెబుతూ వచ్చి.. ఇప్పుడు 2025 జూన్‌కు

Polavaram project : ఇంకెప్పుడు!

పోలవరం గడువు మరో ఏడాది పొడిగింపు

వచ్చే ఎన్నికల్లోపే ప్రాజెక్టు తొలిదశ

వచ్చే ఎన్నికల్లోపే ప్రాజెక్టు తొలిదశ

పూర్తికి కేంద్ర మంత్రి ఆదేశం

జగన్‌ అభిప్రాయమూ అదేనని వ్యాఖ్య

నివ్వెరపోయిన రాష్ట్ర అధికార గణం

2020 నుంచి వాయిదాలే వాయిదాలు

ఎన్నికల ముందు చెప్పిన మాట సరే..

శాసనసభలో ఇచ్చిన హామీలనూ నిలబెట్టుకోని ముఖ్యమంత్రి

అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ‘వాయిదాల వలయం’లో చిక్కుకుంది. ప్రాజెక్టు పూర్తి లక్ష్యాన్ని జగన్‌ సర్కారు ఏటేటా పొడిగించుకుంటూ పోతోంది. మొన్నటిదాకా 2024 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని చెబుతూ వచ్చి.. ఇప్పుడు 2025 జూన్‌కు పూర్తవుతుందని అంటోంది. ‘‘41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేసి.. సార్వత్రిక ఎన్నికల్లోగా అంటే 2024 ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు’’ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పగా... అదేంకాదు, 2025 జూన్‌ నాటికిగానీ పనులు పూర్తి కావని రాష్ట్ర అధికారులు తేల్చేశారు. అదికూడా... 41.15 మీటర్ల కాంటూరుకే! అంటే... పోలవరం ప్రాజెక్టుకు ‘నవ్యాంధ్ర జల జీవనాడి’ ఖ్యాతి పోతుంది. అది బ్యారేజీ స్థాయికి పరిమితమవుతుంది. గురువారం ఢిల్లీలోని జలశక్తి శాఖ కాన్ఫరెన్స్‌ హాల్‌లో షెకావత్‌ అధ్యక్షతన పోలవరం నిర్మాణ పురోగతి, ఆర్థిక వ్యయాలపై సమీక్ష జరిగింది. జలశక్తి శాఖ సలహాదారు వెదెరె శ్రీరామ్‌, కేంద్ర జల సంఘం చైర్మన్‌ వోరా, జలశక్తి కార్యదర్శి పంకజ్‌కుమార్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్‌, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు(ఎఫ్‌ఏసీ), ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజనీరు సుధాకరబాబు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ప్రాజెక్టును 2025 జూన్‌నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే 2024 ఎన్నికలకు ముందే 41.15 మీటర్ల కాంటూరులో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న అభిప్రాయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉన్నారని.. ఆ దిశగా అడుగులు వేయాలని జల వనరుల శాఖను షెకావత్‌ కోరారు. 45.72 మీటర్ల గరిష్ఠ కాంటూరు ఊసెత్తకుండా.. తొలిదశ నిర్మాణ పనులు ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని సీఎం కాంక్షిస్తున్నారని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడం సమీక్షలో పాల్గొన్న అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. 41.15 మీటర్ల కాంటూరులో నిర్మాణ పనులు, భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఎంత వ్యయమవుతుందో చెప్పాలని ఆయన రాష్ట్రాన్ని అడిగారు. రూ.17,144 కోట్లుగా అంచనా వేశామని జల వనరుల శాఖ అధికారులు నివేదించారు. డయాఫ్రం వాల్‌ మరమ్మతుల కోసం కావలసిన రూ.1,556 కోట్లు కూడా కలిపితే అంచనా వ్యయం రూ.18,700 కోట్లకు చేరుకుందని తెలిపారు. కీలకమైన డిజైన్లను కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా డిజైన్లకు ఆమోదం లభించలేదా అని జల సంఘాన్ని షెకావత్‌ ప్రశ్నించారు. త్వరితగతిన ఆమోదించాలని ఆదేశించారు. ముంపుపై ఛత్తీస్‌గఢ్‌ సంయుక్త సర్వే చేపట్టిందని.. ఒడిసా ఇంకా చేయలేదని రాష్ట్ర అధికారులు తెలిపారు. 41.15 మీటర్ల కాంటూరులో నీటి నిల్వ కోసం 68,538.99 ఎకరాలు కావలసి ఉండగా.. 65,628.39 ఎకరాలు సేకరించామని.. మరో 2,910.60 ఎకరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు. 2005 భూసేకరణ చట్టం ప్రకారం 3,780 నిర్వాసిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 17,166 నిర్వాసిత కుటుంబాలను తరలించాల్సి ఉంటే.. 8,280 కుటుంబాలను సురక్షిత కాలనీలకు తరలించామని.. ఇంకా 8,886 కుటుంబాలను తరలించాల్సి ఉందని తెలిపారు. ఇటీవల లైడర్‌ సర్వేను నిర్వహిస్తే.. నిర్వాసిత కుటుంబాల సంఖ్య పెరిగిందని.. ఈ సంఖ్యను ఈ నెలాఖరులోగా వెల్లడిస్తామన్నారు. పనులు పూర్తి చేసేందుకు నిధుల విడుదల, పెరిగిన భూసేకరణ వ్యయం, డిజైన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తన కార్యాలయ అధికారులను షెకావత్‌ ఆదేశించారు. నిధులపై ఏమీ తేల్చకుండానే సమీక్షను ముగించారు.

చెప్పేదొకటి.. చేసేదొకటి..!

2019 ఎన్నికల తర్వాత అప్పటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థను యథాతథంగా కొనసాగిస్తే.. 2020 ఖరీఫ్‌నాటికి పూర్తయ్యేది. కానీ జగన్‌ గద్దెనెక్కగానే.. అవినీతి ఆరోపణలు గుప్పించి.. ఆ ఏడాది జూన్‌ ఆరో తేదీన నిర్మాణ సంస్థలను అర్ధాంతరంగా తొలగించారు. 2019 నవంబరులో పనులను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు అప్పగించారు. 2020 డిసెంబరు నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని నిండు శాసనసభలో ఆయన ప్రకటించారు. కానీ ఏమాత్రం ముందుకు సాగలేదు. ఆ తర్వాత 2021 ఖరీఫ్‌ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి మరోసారి శాసనసభలో చెప్పారు. అదీ జరగలేదు. తర్వాత ఏకంగా ఏడాదిన్నర వాయిదా వేశారు. 2022 డిసెంబరునాటికి పూర్తి చేస్తామంటూ శాసనసభలోనే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడించారు. కానీ వరదలు వచ్చి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వరదలకు డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందని జలవనరుల మంత్రి, సీఎం గగ్గోలు మొదలుపెట్టారు. నాటి సీఎం చంద్రబాబు డయాఫ్రం వాల్‌ కంటే ముందే కాఫర్‌ డ్యాం కట్టడం వల్ల ఇది జరిగిందన్నారు. ఆ తర్వాత వాల్‌ బాగా దెబ్బతిందని.. మరమ్మతులు చేయాలంటూ ఏకంగా డిజైన్లే రూపొందించి కేంద్రం ఆమోదానికి, నిధుల విడుదల కోసం పంపించారు. అసలది దెబ్బతిన్నదో లేదో నిర్ధారణ కాకుండా మరమ్మతులేంటని కేంద్రం నిలదీసింది. అధ్యయనం చేసే బాధ్యతను నేషనల్‌ హైడ్రో–ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) బృందానికి అప్పగించింది. సదరు వాల్‌ కొట్టుకుపోలేదని.. రెండు మూడు చోట్ల దెబ్బతిన్నదని.. వాటికి మరమ్మతులు చేస్తే చాలని ఎన్‌హెచ్‌పీసీ సూచించడంతో కేంద్ర జలసంఘం కూడా అదే స్పష్టం చేసింది. ఆ తర్వాత 2024 జూన్‌ నాటికి గాని ప్రాజెక్టు పూర్తి కాదని కేంద్రానికి సమాచారమిచ్చారు. ఇప్పుడు మళ్లీ 2025 జూన్‌ అని అంటున్నారు.

అడహాక్‌ నిధులపై

పరిశీలిస్తామన్నారు: ఈఎన్‌సీ

సమీక్ష అనంతరం ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలనూ మంత్రి సమీక్షించారని.. నిధుల రీయింబర్స్‌మెంట్‌పైనా విస్తృతంగా చర్చ జరిగిందని, డిజైన్ల గురించి కూడా స్పష్టత ఇచ్చామని చెప్పారు. ప్రాజెక్టును 2025 జూన్‌కల్లా పూర్తి చేస్తామని తాము తెలియజేశామని.. కానీ వీలైతే ఏడాది ముందుగానే పూర్తి చేయాలని కేంద్ర మంత్రి సూచించారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.17,144 కోట్లఅడ్‌హాక్‌ నిధులు ముందస్తుగా ఇవ్వాలని సీఎం జగన్‌ గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, ఆ అంశం తమ పరిశీలనలో ఉందని, త్వరగా ప్రాసెస్‌ చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి చెప్పారని వివరించారు. అడ్‌హాక్‌ నిధుల గురించి పలు అంశాలపై స్పష్టత అడిగారని.. అవన్నీ ఇస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ తర్వాత జలశక్తి శాఖ కేబినెట్‌ నోట్‌ను కేంద్ర ఆర్థిక శాఖకు పంపిస్తుందన్నారు. సవరించిన అంచనాలపైనా కొన్ని స్పష్టతలు అడిగారని చెప్పారు. ఇక ప్రాజెక్టు తొలి దశ 41.5 మీటర్ల ఎత్తుకే పరిమితమని.. దానికే పునరావాసం, పరిహారం ప్యాకేజీ కోరామని పేర్కొన్నారు.

కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలివీ..

• లైడర్‌ సర్వేలో 41.15 మీటర్ల కాంటూరులో 16,000 మంది నిర్వాసిత కుటుంబాలు ఒకేసారి ఎలా పెరిగాయి?

• ఇసుకతో భారీ గుంతలను పూడ్చేందుకు వైబ్రో కంపాక్షన్‌ డిజైన్లను వెంటనే ఎందుకు పంపడం లేదు? రాష్ట్ర జల వనరుల శాఖ ఎందుకు జాప్యం చేస్తోంది?

• ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజ్‌ను ఎందుకు అరికట్టడం లేదు? వాటి డిజైన్లను ఎందుకు పంపడం లేదు?

• డయాఫ్రం వాల్‌ మరమ్మతులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు?

Updated Date - 2023-06-02T04:09:36+05:30 IST