Kotam Reddy: మొన్న ఆనం.. నేడు కోటంరెడ్డి స్థానంలో..

ABN , First Publish Date - 2023-02-02T17:17:31+05:30 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు (Nellore) రూరల్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) పార్టీ శ్రేణుల ఎదుట బాహాటంగా ప్రకటించారు.

Kotam Reddy: మొన్న ఆనం.. నేడు కోటంరెడ్డి స్థానంలో..

నెల్లూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు (Nellore) రూరల్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) పార్టీ శ్రేణుల ఎదుట బాహాటంగా ప్రకటించారు. ఆయన ఇలా ప్రకటించారో లేదో.. అంతలోనే వైసీపీ అధిష్టానం కోటంరెడ్డిపై వేటువేసినంత పనిచేసింది. కోటంరెడ్డి విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జ్‌గా ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి (Adala Prabhakara Reddy)ని వైసీపీ నియమించింది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే ఆదాల పోటీ చేస్తారని కూడా వైసీపీ (YCP) ప్రకటించడం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా వైసీపీలో ముసలం ప్రారంభమైంది. పది అసెంబ్లీ స్థానాలుంటే అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డితో మొదలైన తిరుగుబాబు జిల్లా అంతా విస్తరించే అవకాశం ఉంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రత్యక్షంగా యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) వంతు వచ్చింది. ఆయన కూడా తీవ్ర స్వరంతో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కొడవలూరి ధనుంజయరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవి పేరుతో తమపై పెత్తనం చెలాయించాలనుకుంటే కుదరదని మండిపడ్డారు ఆయన. అయితే వైసీపీ అధిష్టానం తిరుగుబాటు నేతలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆనం రాంనారాయణరెడ్డి(Anam Ramnarayana Reddy)ని నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నేదురమల్లి రాంకుమార్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఇప్పుడు కోటంరెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించం గమనార్హం. ఈ ఇద్దరి నేతలను వైసీపీ అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో (Nellore District) క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీకి (YSRCP) ఇప్పుడు గడ్డుకాలం మొదలైందని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) పెనుమార్పులు జరుగుతాయా..? నెల్లూరు పెద్దారెడ్లు (Peddareddy) వైసీపీ అధిష్టానంపై ఒక్కొక్కరుగా తిరుగుబాటు చేస్తున్నారా..? మొన్న ఆనం.. నిన్న కోటంరెడ్డి.. ఇవాళ మేకపాటి..? రేపు ఇంకెవరో అని వైసీపీలో టెన్షన్ వాతావరణ నెలకొంది.

వైసీపీలో కుమ్ములాటలు

నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాల పరిధిలో అత్యధిక నియోజకవర్గాల్లో నేతలు, కేడర్‌ మధ్య గొడవలున్నాయి. ఇవి పార్టీకి నష్టం చేసేవి. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే అవకాశమున్నా... పార్టీ ఈ దిశగా చొరవ తీసుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో పార్టీకన్నా వ్యక్తులే ముఖ్యమన్నట్లుగా వర్గపోరు కొనసాగుతోంది. నాలుగు నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన మంత్రి పరిస్థితి కూడా బాగోలేదు. ఆయన సొంత మనుషులకు తప్ప తమకు ఉపయోగపడటం లేదని కేడర్‌ అసంతృప్తిగా ఉంది. ఆయనపై కేడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకటీ రెండూ కాదు... అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇది టీడీపీకి బాగా కలిసొచ్చే అంశం. వైసీపీ నేరుగా గెలిచిన, టీడీపీ టికెట్‌తో గెలిచి వైసీపీతో అంటకాగుతున్న వారితో కలిపి... 135 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య కుమ్ములాటలు, గొడవలు, వర్గపోరు తారస్థాయికి చేరింది.

Updated Date - 2023-02-02T17:44:17+05:30 IST