ప్రజల్లో మార్పు మొదలైంది
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:46 PM
ప్రజల్లో మార్పు మొదలైందని, కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ అన్నారు.
నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్
నంద్యాల టౌన్, డిసెంబరు 17 : ప్రజల్లో మార్పు మొదలైందని, కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ అన్నారు. ఆదివారం నంద్యాలలోని రాజీవ్గాంధీ భవనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంటింటికీ కాంగ్రెస్ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనూ ఇందిరమ్మ రాజ్యమే రానుందని అన్నారు. నిన్న కర్నాటక, నేడు తెలంగాణా, రేపు ఆంధ్రప్రదేశ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందనేదే తమ నినాదమని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారం చేపట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమతో పాటు విభజన హామీల అమలు మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లనున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేయడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, వైజాగ్ రైల్వే జోన్, తదితర అంశాలను పూర్తిగా మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.