Pawan Kalyan : బీసీలు శాసించాలి!

ABN , First Publish Date - 2023-03-12T03:17:27+05:30 IST

రాష్ట్రంలో బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌. హక్కుల కన్నా ముఖ్యం ఐక్యత, ఆర్థిక పరిపుష్టి. వాటిని సాధించిన రోజున బీసీలకు రాజ్యాధికారం తప్పక సిద్ధిస్తుంది. ఈ కృషిలో జనసేన మీ వెంట ఉంటుంది’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan : బీసీలు శాసించాలి!

బీసీలతో కాపులు అధికారం పంచుకోవాలి

సేనను గెలిపిస్తే టీటీడీ బోర్డులో సగం బీసీలకే

బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్‌

సాధికారత తెస్తామని అందరూ చెప్పారు

కానీ, సాధించే ఏకైక నాయకత్వం నాదే

ఐక్యత,ఆర్థిక పరిపుష్టితోనే రాజ్యాధికారం

ఖాళీ పోస్టులపై ఉద్యమిస్తే మీతో ఉంటా

ఎక్కడికైనా వచ్చి ఒకరోజు దీక్ష చేస్తా

బీసీ సంక్షేమంపై రౌండ్‌ టేబుల్‌లో పవన్‌

ఎల్లుండి బీసీ డిక్లరేషన్‌: మనోహర్‌

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) :‘‘రాష్ట్రంలో బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌. హక్కుల కన్నా ముఖ్యం ఐక్యత, ఆర్థిక పరిపుష్టి. వాటిని సాధించిన రోజున బీసీలకు రాజ్యాధికారం తప్పక సిద్ధిస్తుంది. ఈ కృషిలో జనసేన మీ వెంట ఉంటుంది’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శనివారం మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమంపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ’’బీసీలంటే ఉత్పత్తి కులాలు. భారతదేశ సంస్కృతికి వెన్నెముక. అత్యధిక సంఖ్యా బలం ఉండి కూడా నేటికీ దేహీ అనే స్థితిలో ఉండటం బాధాకరం.

అత్యధిక బీసీలు ఉన్న చోట కూడా మిగతా కులాలకు చెందిన వ్యక్తులు గెలుస్తున్నారు. బీసీల అనైక్యతే దీనికి కారణం. బీసీలకు సాధికారిత రావాలని మాటలు చెప్పే నాయకుల్నే మీరు చూశారు. చేతల్లో దాన్ని సాధించి చూపించే నాయకత్వాన్ని నేను చూపిస్తాను. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సీటు కోసం పొత్తు కూడా వదులకుందామని అనుకున్నాను. నేను బీసీలకు అంత విలువ ఇస్తాను. నన్ను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు, దళితులతో తిట్టిస్తారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బీసీలు, కాపులు, దళితులు కొట్టుకోవాలని వాళ్లు కోరుకుంటున్నారు. ఈ పన్నాగం పన్నిన నాయకులు మాత్రం ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరు. విమర్శించుకోవడం కూడా చాలా చక్కగా విమర్శించుకుంటారు’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో 26 బీసీ కులాలకు గుర్తింపు తొలగిస్తే, బీసీలు ఎందుకు ఉద్యమించలేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

9pawan1.jpg

పది వేలిచ్చి కడుపుకొడుతున్నారు..

బీసీల సబ్‌ప్లాన్‌ నిధులు దాదారు రూ.34 వేల కోట్లు దారి మళ్లించారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ‘‘56 బీసీ కార్పొరేషన్‌ పదవులు స్టిక్కర్లకే పరిమితం అయ్యాయి. 36 మంది టీటీడీ బోర్డు సభ్యులుంటే అందులో ముగ్గురే బీసీలు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ బోర్డు సభ్యుల్లో సగం మందిని బీసీలతో నింపుతాం. బీసీలు రెండు కోట్ల మంది ఉంటే కేవలం 4.37 లక్షల మందికి ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి వాళ్ల భవిష్యత్తును కొనేస్తున్నారు. జీవో నెం 217 తీసుకొచ్చి మత్స్యకారుల కడుపుకొట్టారు. రూ.20 కోట్లు పెట్టి మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తే వలసలను నిరోధించవచ్చు. అయినా దీనిపై ఎవరూ ఆలోచన చేయడంలేదు. దాదాపు 400 బ్యాక్‌లాగ్‌’’పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. వాటిని భర్తీ చేయాలని బీసీలు గనుక ఉద్యమిస్తే నేను అండగా ఉంటా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ఒక రోజు దీక్షకు కూర్చుంటా’’నని హామీ ఇచ్చారు.

నాకు కులాల్లేవు.. అందరిని వాడిని..

’’తూర్పుగోదావరి జిల్లాల్లో కాపులకు, శెట్టిబలిజలకు పడదని నాకు చెప్పారు. రెండు రోజులు అక్కడే కూర్చొని ఈ వర్గాల మధ్య సయోధ్య కుదిర్చాను. శెట్టిబలిజల పండగకు కాపులు శుభాకాంక్షలు చెప్పే పరిస్థితి తెచ్చాను. నన్ను అన్ని కులాలూ తమ నాయకుడిగానే చూస్తాయి. నిజంగా నన్ను కాపులు ఓన్‌ చేసుకుని ఉంటే ఓడిపోయేవాడిని కాదు కదా!. గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లలో సగానికి పైగా బీసీలు వేసినవే. ముఖ్యంగా మత్స్యకారులు అండగా నిలబడ్డారు. మనం ముందు ఆర్థిక పరిపుష్ఠి సాధించాలి. దీనిపై జనసేన ముసాయిదా రూపొందిస్తుంది. బీసీలకు ఆర్థిక సత్తా ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జనసేన గెలుపు.. బీసీల గెలుపు. బీసీలకు అధికారంలోకి తీసుకురావాలని పంతంపట్టాను.’’ అని పవన్‌ స్పష్టం చేశారు. బీసీలతో కలిసి కాపు నాయకులంతా అధికారం పంచుకోవాలని ఆయన పవన్‌ సూచించారు. బీసీ సాధికారత కోసం వినియోగించాల్సిన నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్‌ మనోహర్‌ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన పవన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారని చెప్పారు. జనసేన నాయకులు కోన తాతారావు తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.

లోహియా మాట..

‘‘జాతీయ నాయకుడు రామ్‌మనోహర్‌ లోహి యా ‘భారతదేశంలో కులం’ అనే పుస్తకం రాశా రు. ఆంధ్రప్రదేశ్‌ కుల రాజకీయాల గురించి ఆ పుస్తకంలో ఆయన ప్రస్తావించారు. ఏపీలో బీసీ లు, దళితులు, కాపులు కలిస్తే రాజ్యాధికారం వారి కే దక్కుతుందని ఆయన రాశారు. ఆ పుస్తకం 1964లో వెలువడింది. అంటే, ఇప్పటికి దాదాపు 50 ఏళ్లయింది. అయినా వారిమధ్య భాగస్వామ్యం కుదరలేదు. నిజంగా అది కుదిరితే మాత్రం....దేహీ అనే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదుగుతాయి. పోరాటాలకు కలిసివచ్చే 146 బీసీకులాలు... బీసీ వ్యక్తిని ఎన్నికల్లో గెలుపించుకోవడానికి ఎందుకు ముందుకురావడం లేదు?’’ అని పవన్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-03-12T03:17:27+05:30 IST