Nursing Studings : నర్సింగ్ విద్యార్థుల గెంటివేత
ABN , Publish Date - Dec 17 , 2023 | 04:55 AM
జగనన్న విద్యా దీవెన డబ్బులు రాలేదంటూ నెల్లూరు జిల్లా కావలిలోని ఓ నర్సింగ్ కళాశాల, తమ ఫైనల్ ఇయర్ విద్యార్థులను బయటకు పంపేసింది.
కళాశాలకు అందని జగనన్న విద్యా దీవెన సొమ్ములు
ఫీజులు చెల్లించి హాజరుకావాలంటూ హుకుం
చొరవ తీసుకున్న కలెక్టర్...
యాజమాన్యంతో సంప్రదింపులు
ఎట్టకేలకు సమస్య పరిష్కారం
కావలిటౌన్, డిసెంబరు 16: జగనన్న విద్యా దీవెన డబ్బులు రాలేదంటూ నెల్లూరు జిల్లా కావలిలోని ఓ నర్సింగ్ కళాశాల, తమ ఫైనల్ ఇయర్ విద్యార్థులను బయటకు పంపేసింది. ఫీజులు వెంటనే చెల్లించకుంటే పరీక్షల ఫీజు కూడా కట్టించుకోమని యాజమాన్యం స్పష్టం చేసింది. కావలి పుల్లారెడ్డినగర్లోని శ్రీసాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం తమను బయటకు పంపేయడంతో శనివారం విద్యార్థినులు కళాశాల బయటే బైఠాయించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులతో కలసి ఆందోళనకు దిగారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కావలి ఆర్డీవో, డీఎంహెచ్వోలను ఆదేశించారు. ఆర్డీవో, డిప్యూటీ డీఎంహెచ్వోలు అందుబాటులో లేరు. దీంతో తహసీల్దార్ మాధవరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎన్ శివకుమార్ కళాశాల వద్దకు చేరుకుని యాజమాన్యంతో మాట్లాడారు. కలెక్టర్ నేరుగా ఒక విద్యార్థినితో సెల్ఫోన్లో మాట్లాడారు. ‘ఫీజుల విషయం ప్రభు త్వం చూసుకుంటుంది. మీరు చక్కగా చదువుకోండి’ అని సూచించారు. ఆర్డీవో శీనానాయక్ కూడా చరవాణి ద్వారా యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో వారు విద్యార్థినులను తరగతులకు అనుమతించారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.