ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు
ABN , First Publish Date - 2023-03-05T03:57:47+05:30 IST
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి.
భారీగా మోహరించిన పోలీసులు
జనసేన కార్యకర్తల నిరసన.. గ్రామంలో ఉద్రిక్తత
రాజకీయ కక్షతోనే కూల్చివేతలు: జనసేన
ఆక్రమణలే తొలగిస్తున్నాం: అధికారులు
తాడేపల్లి, మార్చి 4: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. జనసేన సభకు గ్రామస్థులు సహకరించారనే కక్షతోనే ఇళ్లను కూల్చివేస్తున్నారని జనసేన ఆరోపించడం, గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటించి బాధితులకు అండగా నిలవడం వంటి ఘటనలతో ఈ గ్రామం రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. జనసేన ప్రతిఘటనతో అప్పట్లో నిలిచిపోయిన కూల్చివేతలు శనివారం మళ్లీ మొదలయ్యాయి. భారీ పోలీసు బందోబస్తుతో వచ్చిన ఎంటీఎంసీ అధికారులు రెండు ఎక్స్కవేటర్లతో సుమారు 12మందికి చెందిన ప్రహరీలను కూల్చివేశారు. పలు ఇళ్లకు లోపలి వరకు మార్కింగ్ ఇచ్చారు. గ్రామంలోకి బయటివారిని రానివ్వలేదు. తనిఖీలు చేసి మరీ గ్రామంలోకి అనుమతించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. జనసేన నేత టి.నరసింహారావు నివాసం వద్ద కూల్చివేతకు ఉపక్రమించగా ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు ప్రతిఘటించడంతో ప్రహరీ కూల్చి వదిలేశారు. పి.నరసింహారావు, ఇండ్ల వెంకట నరసయ్య, సాంబయ్య, గాజుల లక్ష్మీనారాయణ, ఉమ, పద్మ తదితరులకు చెందిన ప్రహరీలను కూల్చి వేశారు. ఓ ఇంటి డాబా పైకి ఎక్కి డ్రిల్లింగ్తో శ్లాబ్కు బొక్కలు పెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు.
జనసేన నిరసన
అధికారులు కక్షసాధింపు చర్యలతోనే కూల్చివేస్తున్నారని, మార్కింగ్లు ఇస్తున్నారని జనసేన నాయకులు నిరసనకు దిగారు. రాజకీయ పార్టీల మీటింగ్లకు సహకరిస్తే ఊరును పగలగొడతారా అని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. కూల్చడం తప్ప కట్టడం చేతగాని ముఖ్యమంత్రి, అధికారులు దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా చూడలేదని, గ్రామస్థులు జనసేనకు సహకరిస్తున్నందున కక్షతో కూల్చివేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని అధికారం నుంచి దించేదాక పోరాటం చేస్తామని జనసేన రాష్ట్ర నాయకుడు బోనబోయిన శ్రీనివా్సయాదవ్ తెలిపారు. బస్సు సౌకర్యం కూడా లేని గ్రామంలో 70 అడుగుల మేరకు రోడ్డును విస్తరించి ఏమి సాధిస్తారని గ్రామస్థులు ప్రశ్నించారు.
ఆక్రమణలు మాత్రమే తొలగించాం
ఇప్పటంలో ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆక్రమణలు మాత్రమే తొలగించామని టౌన్ ప్లానింగ్ అధికారి లక్ష్మీదొర తెలిపారు. తొలగింపుల అనంతరం డివైడర్లు, స్ట్రీట్ లైట్లు వస్తాయని, ప్రభుత్వ భూమిని రక్షించుకోవాలి కాబట్టి స్ర్టీట్ మ్యాపు ప్రకారం మార్కింగ్ వరకు నిర్మాణాలను తొలగిస్తామన్నారు. అడుగు, అరడుగు అయితే పట్టించుకోమని, ఆక్రమణలపై ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చామన్నారు.