36 ఉపగ్రహాలతో నింగిలోకి.. నేడే ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగం

ABN , First Publish Date - 2023-03-26T04:02:05+05:30 IST

అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం3ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదివారం ప్రయోగించనుంది.

36 ఉపగ్రహాలతో నింగిలోకి.. నేడే ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగం

కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. తరలివచ్చిన విదేశీ శాస్త్రవేత్తలు

సూళ్లూరుపేట, మార్చి 25: అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం3ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదివారం ప్రయోగించనుంది. ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగవేదిక నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. యూకేకి చెందిన 5805 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలతో సిద్ధమైన రాకెట్‌ కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. 24:30 గంటలు నిరాటకంగా కౌంట్‌డౌన్‌ కొనసాగిన అనంతరం రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, శాస్త్రవేత్తలతో కలిసి సందర్శించారు. రాకెట్‌ విజయం కోసం ఇస్రో చైర్మన్‌ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ వారికి పూజలు చేశారు. ఇస్రో న్యూ స్పేస్‌ ఇండియాతో కుదుర్చుకొన్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. మన శాస్త్రవేత్తలతో పాటు విదేశీ శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకున్నారు. ఇప్పటి వరకు ఇస్రో ఈ తరహా ప్రయోగాలు 5 చేపట్టగా అన్నీ విజయాలందించాయి. ఇది ఆరో ప్రయోగం.

Updated Date - 2023-03-26T04:02:05+05:30 IST