సంగీతం, కళలను పాఠ్యాంశాల్లో చేర్చాలి
ABN , First Publish Date - 2023-09-03T02:57:15+05:30 IST
దేశంలో సంగీతం, కళలు మళ్లీ పునరుజ్జీవం పొందాలంటే వాటిని పాఠ్యాంశాల్లో చేర్చాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి ‘నాద విద్యాభారతి’ పురస్కారం ప్రదానం
మద్దిలపాలెం (విశాఖపట్నం), సెప్టెంబరు 2: దేశంలో సంగీతం, కళలు మళ్లీ పునరుజ్జీవం పొందాలంటే వాటిని పాఠ్యాంశాల్లో చేర్చాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామికి ‘నాద విద్యాభారతి’ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు భారతదేశం పుట్టినిల్లు అన్నారు. నేటి యువత కళల పట్ల ఆసక్తి చూపకపోవడం వల్ల అవి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. రామస్వామి మాట్లాడుతూ కర్ణాటక సంగీతానికి ఆదరణ లభించడానికి తెలుగు భాషే కారణమన్నారు. 52 అక్షరాలు ఉన్న తెలుగు వల్ల ఎన్నో రాగాలు, కీర్తనలు వచ్చాయని చెప్పారు. కాగా.. రామస్వామికి ‘వైభవ్ జ్యువెలర్స్’ తరపున ఎండీ అండ్ చైర్పర్సన్ గ్రంధి మల్లికా మనోజ్ స్వర్ణ కమలం బహూకరించారు.