పొన్నూరులో కేజీఎ్ఫను మించిన దోపిడీ
ABN , Publish Date - Dec 28 , 2023 | 04:00 AM
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో కేజీఎ్ఫను మించిన స్థాయిలో మైనింగ్ దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు.
ఊహకు కూడా అందనిస్థాయిలో తవ్వకాలు: మాజీ మంత్రి ఆనందబాబు
వైసీపీ మైనింగ్ దోపిడీకి కొండలు, గుట్టలు విలవిల: మాజీ మంత్రి ప్రత్తిపాటి
శేకూరులో మైనింగ్ మాఫియాపై పోరుబాట ముగింపు సభ
గుంటూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో కేజీఎ్ఫను మించిన స్థాయిలో మైనింగ్ దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాపై పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో టీడీపీ చేపట్టిన మైనింగ్ మాఫియాపై పోరుబాట పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శేకూరులోని ఎన్టీఆర్ సెంటర్లో బహిరంగ సభ జరిగింది. చేబ్రోలు మండలంలో జరిగిన మైనింగ్ దోపిడీపై ‘డాక్యుమెంటరీ’ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, ‘రూ.2,000 కోట్లకు పైన అక్రమ తవ్వకాలు జరిగాయంటే అది కేజీఎఫ్ దోపిడీకి ఏమాత్రం తీసిపోదు. ఎమ్మెల్యే కిలారు రోశయ్య జగన్కు ఏజెంటుగా ఉంటూ తాడేపల్లి ప్యాలె్సకు కప్పం కడుతున్నారు’ అని ఆరోపించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వం మైనింగ్ దోపిడీకి కొండలు, గుట్టలు కూడా అల్లాడిపోతున్నాయి. 175 నియోజకవర్గాల్లోని సహజ వనరులను వైసీపీ ప్రభుత్వం కొల్లగొట్టింది. గతంలో అధికారులు కోర్టు, జైలు అంటే భయపడేవారు. జగన్ వచ్చాక ఆ భయమే లేకుండా పోయింది. అంతగా వ్యవస్థలను జగన్రెడ్డి దిగజార్చారు. వైసీపీ పని అయిపోయింది. ఒక ఎమ్మెల్సీ జనసేనలో చేరారు. ఒక ఎమ్మెల్యే రాజకీయాల నుంచి పారిపోయారు’ అని అన్నారు. నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ‘నేల తల్లి గర్భశోకానికి విలువ కట్టలేం. ఈ ప్రాంతంలో 1,300 ఎకరాల తోటలు 500 ఎకరాలకు పడిపోయాయి. 700 ఎకరాలను మైనింగ్ మాఫియా కొల్లగొట్టింది’ అని అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ కేజీఎ్ఫను మించిన స్థాయిలో పీజీఎఫ్ (పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్స్) దోపిడీ సాగిందన్నారు.