లండన్కు జగన్ దంపతులు!
ABN , First Publish Date - 2023-04-11T02:32:33+05:30 IST
సీఎం జగన్ మరోమారు లండన్ వెళ్తున్నారు. లండన్లో చదువుకొంటున్న కుమార్తెతో వేసవి సెలవులు గడిపేందుకు ముఖ్యమంత్రి దంపతులు ఈ నెల 21న బయలుదేరే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.
21న కుమార్తె వద్దకు
అమరావతి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ మరోమారు లండన్ వెళ్తున్నారు. లండన్లో చదువుకొంటున్న కుమార్తెతో వేసవి సెలవులు గడిపేందుకు ముఖ్యమంత్రి దంపతులు ఈ నెల 21న బయలుదేరే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. అయితే, పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారుకాలేదని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. లండన్లోని కుమార్తె వద్దకు జగన్ దంపతులు ఏటా వెళ్తున్నారు. గత ఏడాది ఆమె డిగ్రీ పట్టా పొందిన సందర్భంలో జగన్ దంపతులు ప్రత్యేకంగా హాజరయ్యారు. 2021లో కుమార్తెల సమక్షంలో జగన్ దంపతులు వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. 2022 మే20న వీరు లండన్ వెళ్లినప్పుడు వివాదం తలెత్తింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు జగన్ ప్రత్యేక విమానంలో దావో్సకు వెళ్లారు. విమానంలో నేరుగా దావోస్ వెళ్లకుండా..లండన్ మీదుగా వెళ్లడం అప్పట్లో దుమారం రేపింది. సంపాదించిన డబ్బును దాచుకోవడానికే జగన్ లండన్ వెళ్లారంటూ రాజకీయపక్షాలు ఆరోపణలు చేశాయి. జగన్ దావోస్ వెళ్లి....రాష్ట్రానికి చెందినవారితోనే ఒప్పందాలు చేసుకున్నారని.. ఈ మాత్రానికే ప్రత్యేక విమానంలో వయా లండన్ వెళ్లాల్సిన అవసరం ఏమిటని నిలదీశాయి. 2019 నుంచి..ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళ్లిరావడం ఆనవాయితీగా మారిపోయిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రత్యేక విమానంలో వెళ్లడం వల్ల ఖజానాపై భారం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.