Lokesh: బీజేపీ పాత్ర లేకపోవచ్చు

ABN , First Publish Date - 2023-09-18T02:50:10+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ లేకపోవచ్చునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లొకేశ్‌ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టు తర్వాత బీజేపీ లేదా కేంద్ర పెద్దలు తమను సంప్రదించలేదని, వారితో చర్చలు జరపడానికి తాను ఢిల్లీ రాలేదని చెప్పారు.

Lokesh: బీజేపీ పాత్ర లేకపోవచ్చు

చంద్రబాబు అరెస్టుపై లోకేశ్‌ స్పందన

జాతీయ స్థాయిలో పొత్తులపై టీడీపీ అధినేత నిర్ణయిస్తారు

ఆయన అవినీతికి పాల్పడలేదు

అరెస్టు చేయడం దారుణం

పోరాటాన్ని ఉధృతం చేస్తాం

సీఐడీ చీఫ్‌ ‘ప్రెస్‌మీట్‌లు’ సర్వీసు నిబంధనలకు విరుద్ధం: లోకేశ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ లేకపోవచ్చునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లొకేశ్‌ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టు తర్వాత బీజేపీ లేదా కేంద్ర పెద్దలు తమను సంప్రదించలేదని, వారితో చర్చలు జరపడానికి తాను ఢిల్లీ రాలేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో పొత్తులపై చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. ‘ఇండియా’ కూటమిలోని పార్టీల నాయకులు చంద్రబాబుతో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల సంఘీభావం ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎటువంటి మచ్చలేని ఆయన్ను తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని, ఈ పరిస్థితి దేశానికే మంచిది కాదన్నారు. ఈ కేసులో ఆధారాలు లేవని, మనీ ట్రేల్‌ లేదని అన్నారు. ఒక తప్పుడు ఆరోపణ వల్ల ఎన్నో లక్షల మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ దెబ్బకు రాష్ట్రానికి కంపెనీలు రావని, యువకుల భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అజేయ కల్లం రెడ్డి, ప్రేమచంద్రా రెడ్డి ఇవాళ బయట ఉన్నారని, వారిని సీఐడీ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 150 మంది వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. జగన్‌ పాలనలో అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయని విమర్శించారు. రోజురోజుకూ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజలు, తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, మహిళలు రోడ్ల మీదకు వచ్చి మద్దతిస్తున్నారన్నారు. పోరాటం ఆపరాదరని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి చేయరాదని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. జైలులో చంద్రబాబు ధైర్యంగా ఉన్నారన్నారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకముందన్నారు. కోర్టుకు సీఐడీ ఎలాంటి ఆధారాలనూ సమర్పించలేదని, రిమాండ్‌ రిపోర్టు చదివితే ఇది అర్థమవుతుందన్నారు. సీఐడీ చీఫ్‌ విలేకరుల సమావేశాలు నిర్వహించడం సర్వీసు నిబంధనలకు వ్యతిరేకమని లోకేశ్‌ అన్నారు.

Updated Date - 2023-09-18T03:28:55+05:30 IST