లిఫ్ట్ చంపేసింది!
ABN , First Publish Date - 2023-03-19T02:39:41+05:30 IST
ఎన్టీటీపీఎ్స(డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం)లో భద్రతా లోపం ఇద్దరు కార్మికుల నిండు ప్రాణాలను బలిగొంది.

ఎన్టీటీపీఎ్సలో ప్రమాదం
4వ ఫ్లోర్లో సమస్య.. అతి కష్టం మీద డోరు తె రచి బయటికి 18 మంది
మళ్లీ డోరు మూసుకుపోవడంతో చిక్కుకుపోయిన ఇద్దరు
16వ ఫ్లోర్కు వెళ్లాక .. తెగిన లిఫ్ట్ వైర్లు.. ఆ ఇద్దరూ మృతి
ఇబ్రహీంపట్నం, మార్చి 18: ఎన్టీటీపీఎ్స(డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం)లో భద్రతా లోపం ఇద్దరు కార్మికుల నిండు ప్రాణాలను బలిగొంది. నిర్మాణ పనుల్లో జాగ్రత్త చర్యలు చేపట్టడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఎన్టీటీపీఎ్సలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్లో శనివారం ఈ ప్రమాదం జరిగింది. మృతులు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. ఎన్టీటీపీఎ్సలో ఐదో దశ నిర్మాణ పనుల్లో భాగంగా ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి పవర్మెక్ అనే సబ్ కాంట్రాక్టు కంపెనీలో పని చేసేందుకు మూడు నెలల క్రితం జార్ఖండ్ నుంచి కార్మికులు వచ్చారు. నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. శనివారం ఉదయం 20 మంది కార్మికులు పనులు చేసేందుకు లిఫ్ట్లో పైకి వెళ్తుండగా అకస్మాత్తుగా నాలుగో ఫ్లోర్ వద్ద లిఫ్ట్కు అంతరాయం కలిగింది. ఆందోళన చెందిన కార్మికుల్లో 18 మంది లిఫ్ట్ డోర్ను అతి కష్టంగా తెరచి బయటికి వచ్చారు. మళ్లీ అకస్మాత్తుగా లిఫ్ట్ డోర్ మూసుకుపోవడంతో చోటుకుమార్ సింగ్(20), జితేంద్ర సింగ్(21) లోపల చిక్కుకుపోయారు. ఇంతలో లిఫ్ట్ పైకి కదులుతూ 16 ఫ్లోర్ వరకు వెళ్లింది. అక్కడ వైర్లు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడిపోయింది. చోటుకుమార్ సింగ్, జితేంద్ర సింగ్లను హుటాహుటిన ఎన్టీటీపీఎస్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందారు. లిఫ్ట్ కింద ఎవ్వరూ చిక్కుకోలేదని ఎన్టీటీపీఎస్ ఫ్యాక్టరీ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.