దుబాయి నుంచి భవిష్యకు విముక్తి!

ABN , First Publish Date - 2023-01-15T03:00:38+05:30 IST

భార్యాభర్తల వివాదంలో ఎడారి దేశంలో చిక్కుకుపోయిన రెండేళ్ల చిన్నారి ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా తల్లి ఒడికి చేరుకుంది.

దుబాయి నుంచి భవిష్యకు విముక్తి!

సిక్కోలులో తల్లి చెంతకు చేరిన రెండేళ్ల చిన్నారి

భార్యాభర్తల వివాదంలో ఇన్నాళ్లూ బందీగా అక్కడే..

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

భార్యాభర్తల వివాదంలో ఎడారి దేశంలో చిక్కుకుపోయిన రెండేళ్ల చిన్నారి ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా తల్లి ఒడికి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన డోకి కావ్య, పార్వతీపురానికి చెందిన శాంక అవినాశ్‌ దంపతుల మధ్య ఇండియాలో వరకట్నం కేసు కొనసాగుతున్న విషయం విదితమే!. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జాలో నివాసముంటున్న వీరి వివాదం పూర్తిగా వీధికెక్కింది. శ్రీకాకుళం జిల్లాలో పోలీసు కేసు నుంచి తప్పించుకోవడానికి తన కన్నకూతురిని తండ్రి అవినాశ్‌ ఆయుధంగా వాడుకున్న తీరు దుబాయి, ఇతర ఎమిరేట్లలోని తెలుగు ప్రవాసీ కుటుంబాల్లో ఆందోళన రేపింది. గల్ఫ్‌లోని ఇస్లామిక్‌ చట్టాల ఆధారంగా చేసుకుని... తన రెండేళ్ల కూతురు భవిష్యను తన భార్య కావ్య, ఆమె తల్లిదండ్రులు(అవినాశ్‌ అత్తమామలు) అపహరించే ప్రమాదముందని షార్జా న్యాయస్థానంలో సఫర్‌ మాన (ప్రయాణం నిషేధం) కేసు పెట్టి ఆ చిన్నారిని తల్లి వెంట ఇండియాకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అయితే ఎట్టకేలకు దుబాయిలోని ఏపీ ఎన్నారై ప్రధాన సమన్వయకర్త ప్రసన్న సోమిరెడ్డి, ఇతర తెలుగు పెద్దలు, అలాగే, పార్వతీపురం మన్యం జిల్లా పోలీసుల ప్రయత్నాలు ఫలించి షార్జాలోని తండ్రి అవినాశ్‌ తన కూతురిని ఇండియాకు పంపగా, శుక్రవారం పార్వతీపురం చేరుకొంది. పార్వతీపురం పోలీస్‌ స్ట్టేషన్‌లో పాపను ఆమె తల్లికి అప్పగించారు.

Updated Date - 2023-01-15T03:00:39+05:30 IST