కొల్లేరు పర్యాటకంగా
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:58 AM
కొల్లేరు సరస్సు, వలస పక్షుల విన్యాసాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు.
అభివృద్ధి చెందాలి: జస్టిస్ కృష్ణమోహన్
కైకలూరు, డిసెంబరు 17: కొల్లేరు సరస్సు, వలస పక్షుల విన్యాసాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం ఏలూరు జిల్లా కైకలూరు మండలం అటపాక పక్షుల కేంద్రాన్ని ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. బోటులో పయనిస్తూ పక్షులను అతి సమీపం నుంచి తిలకించారు. అటవీశాఖ డిప్యూటీ రేంజర్ జయప్రకాష్ కొల్లేరు, పక్షుల విశిష్టత, ఏయే దేశాల నుంచి పక్షులు వలస వస్తున్నాయో న్యాయమూర్తికి వివరించారు. అనంతరం పర్యావరణ విద్యా కేంద్రంలోని పక్షులు, సంప్రదాయ వేట సాగించే మత్స్యకారుడి నమూనాలను న్యాయమూర్తి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పర్యాటక కేంద్రంగా కొల్లేరు మరింత అభివృద్ధి చెందాలని, పక్షుల ఆవాస కేంద్రాల ఏర్పాటులో అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ బాగుందన్నారు. ఆయన వెంట ఏలూరు జిల్లా న్యాయాధికారి సీహెచ్. పురుషోత్తం, కైకలూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి వీవీఎన్వీ లక్ష్మి, ఇన్చార్జి జూనియర్ సివిల్ న్యాయాధికారి బి. గాయత్రి తదితరులు ఉన్నారు.