న్యాయానికి న్యాయమే జరుగుతుంది
ABN , First Publish Date - 2023-09-22T03:57:29+05:30 IST
సుప్రీం కోర్టు తీర్పును అనుసరించే హైకోర్టు తీర్పు ఉంటుంది. చంద్రబాబు విడుదల ఖాయం. న్యాయానికి న్యాయమే జరుగుతుంది
చంద్రబాబు విడుదల ఖాయం
జైలులో బాబుకి ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత
నోటీసులు ఇవ్వకుండా లోకేశ్ని అరెస్టు చేయడమే లక్ష్యం: రఘురామరాజు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘సుప్రీం కోర్టు తీర్పును అనుసరించే హైకోర్టు తీర్పు ఉంటుంది. చంద్రబాబు విడుదల ఖాయం. న్యాయానికి న్యాయమే జరుగుతుంది’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తప్పు మీద తప్పులు చేస్తూ, దరిద్రపు వేషాలు శృతి మించితే ప్రజలు తిరగబడి వైసీపీ నేతల ముఖాన ఉమ్మేసి, తొక్కుకుంటూ వెళ్తారు. రాజమండ్రి జైల్లో దోమలు కుట్టి వీర వెంకట సత్యనారాయణ అనే ఖైదీ డెంగీతో మృతి చెందాడు. చంద్రబాబుకి రేపు ఏదైనా అపకారం జరిగితే వైసీపీని కాపాడడానికి పోలీసులు, వారి ఆయుధాలు కూడా పనిచేయవు. కరోనా అంటించి గతంలో ఇదే పాలకులు కొందరిని చంపించిన దాఖలాలు ఉన్నాయి. యడ్యూరప్ప పదవి కాలం ముగిసిన తర్వాతే ఆయనపై కూడా కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు పదవీకాలం ముగిసిన నాలుగున్నర ఏళ్ల అనంతరం ఎన్నికలు సమీపిస్తున్నాయన్న కారణంతో భయపడి, మా పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్న ఉద్దేశంతో ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వై నాట్ 175 నుంచి 17 స్థానాలకు దిగజారిన తర్వాత, తమ అన్యాయాలను అడుగడుగునా అడ్డుకుంటూ పోతే తమ పార్టీ పరిస్థితి ఏమిటి అని భావించిన సీఎం జగన్... నేరుగా చంద్రబాబుపై దాడికి దిగారు’’ అని రఘురామ ఆరోపించారు.
కస్టడీ పిటిషన్పై తొందరేముంది?
‘‘కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టవద్దని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన తర్వాత, రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉన్న నేపథ్యంలో, శుక్రవారం హైకోర్టు తీర్పు ఇస్తుందని తెలిసిన తరువాత కూడా, గురువారం కస్టడీ పిటిషన్ విచారణకు చేపట్టారని తెలిసి నాకు తెలిసిన న్యాయ కోవిదులంతా నివ్వెర పోయారు. లోకేశ్ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీలో ఉన్నారంటూ కొంతమంది పనికిమాలినవాళ్లు మాట్లాడుతున్నారు. లోకేశ్కు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఇస్తే ఆయన విచారణకు హాజరు కాకుండా ఢిల్లీలో ఉన్నారా?, తన తండ్రికి వచ్చిన కష్టానికి బాధ్యత కలిగిన కొడుకుగా ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులను కలుసుకుంటూ మద్దతును కూడగడుతున్నారు. ఒకవేళ హైకోర్టులో తీర్పు సానుకూలంగా రాకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. నోటీసులు ఇవ్వకుండానే ఏదో రకంగా లోకేశ్ను కూడా అరెస్టు చేయాలన్నదే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్దేశం’’ అని రఘురామ అన్నారు. రాష్ట్రంలో విద్యా విధ్వంసానికి సీఎం జగన్ తెర లేపారని విమర్శించారు. రాష్ట్రంలోని న్యాయస్థానాలలో 83 మంది తన సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రభుత్వ న్యాయవాద పదవులను కట్టబెట్టిన జగన్.. మళ్లీ ఆయనే నా ఎస్సీలు, నా బీసీలు అంటున్నారంటూ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.