‘నాసా’లో కలికిరి అమ్మాయి వ్యోమగామి శిక్షణ పొందిన జోషిత
ABN , First Publish Date - 2023-11-29T04:31:45+05:30 IST
అంతరిక్షంలోకి వెళ్లడం కోసం అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన కాలువ జోషిత అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో పది రోజుల వ్యోమగామి శిక్షణ పొందారు.
![‘నాసా’లో కలికిరి అమ్మాయి వ్యోమగామి శిక్షణ పొందిన జోషిత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కలికిరి, నవంబరు 28: అంతరిక్షంలోకి వెళ్లడం కోసం అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన కాలువ జోషిత అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో పది రోజుల వ్యోమగామి శిక్షణ పొందారు. ఆమె తిరుపతి శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం విద్యార్థిని. జోషిత తల్లి శ్రీలత స్వస్థలం కలికిరి మండలంలోని గుట్టపాలెం పంచాయతీ డీకే పల్లె. భర్తకు దూరమైన శ్రీలత పిల్లలను చదివించుకుంటూ తిరుపతిలో స్థిరపడ్డారు. భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి కల్పనా చావ్లా స్ఫూర్తితో జోషిత వ్యోమగామిగా మారాలని నిర్ణయించుకున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతి ఏటా స్పేస్ ఇంజనీరింగ్పై పట్టున్న ఔత్సాహిక విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేసి పది రోజుల ప్రాథమిక అవగాహన శిక్షణ అందిస్తోంది. ఈ ఏడాది ఈ శిక్షణ కోసం నాసా నిర్వహించిన పరీక్షలు, ఇంటర్వ్యూల్లో మన దేశం నుంచి నలుగురు ఎంపికవగా, అందులో జోషిత ఒకరు. ఈ నెల 11 నుంచి 19 వరకూ అమెరికాలోని నాసాలో వీరికి శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా పైలెట్ డ్రైవింగ్, మూన్ గ్రావిటీ, స్కూబా డైవింగ్, మల్టీయాక్సిస్ చైరింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చారని తెలిపారు. అంతరిక్ష సంబంధిత వర్క్షాపులోనూ పాల్గొన్నట్లు వివరించారు. తరువాత 1500 అడుగుల లోతుకు మించిన స్కూబా డైవింగ్లో నెల రోజుల శిక్షణ పొందడానికి పోలెండ్ వెళ్లాల్సి ఉందని జోషిత తల్లి శ్రీలత తెలిపారు.