రాజకీయాలను భ్రష్టు పట్టించిన జగన్
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:36 AM
విలువలతో కూడుకున్న రాజకీయాలను జగన్ చేయడం లేదని, రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
బాబుని గెలిపించండి... రాష్ట్ర భవిష్యత్ను కాపాడండి: మాజీ మంత్రి ఆనం
రాష్ట్రంలో రాక్షస పాలన: కోటంరెడ్డి
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం: మేకపాటి
బద్వేలు టౌన్, డిసెంబరు 25: విలువలతో కూడుకున్న రాజకీయాలను జగన్ చేయడం లేదని, రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో బిజివేముల వీరారెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద పలువురు నేతలతో కలసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆనం మాట్లాడుతూ... కేవలం తన భజన చేసేవారికే పెద్దపీట వేస్తూ, నచ్చని వారిని ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం వంటి పనులు ముఖ్యమంత్రి జగన్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. సీఎం జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా లేరని, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయఢంకా మోగిస్తుందని, అహంకారంతో పరిపాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా రాక్షస పాలన సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని అన్నారు. బటన్ నొక్కి ఉచితం పేరిట ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.90 లాగేసుకుంటున్న తీరును ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ... ఏపీని విధ్వంసకరంగా తయారు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. జగన్మోహన్రెడ్డి ఇతరుల మాటలు నమ్మి తనను పక్కనబెట్టడమే కాకుండా చిన్నచూపు చూశాడని మండిపడ్డారు. కడప జిల్లాలో టీడీపీ పార్టీకి పూర్వవైభవం వచ్చిందన్నారు. నూరు శాతం కడప, నెల్లూరు జిల్లాల్లో కూడా పదికి పది ఎమ్మెల్యేలు గెలిచి విజయఢంకా మోగిస్తుందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి, టీడీపీ నాయకులు ఆర్.శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి, బొజ్జ రోశన్న, విజయమ్మ, రితీశ్కుమార్రెడ్డి తదితరులు బిజివేముల వీరారెడ్డి మంత్రిగా బద్వేలు నియోజకవర్గానికి చేసిన సేవలను కొనియాడారు.