Share News

Infection : పెద్ద ప్రాణాలకు ఇన్‌ఫెక్షన్‌!

ABN , First Publish Date - 2023-11-22T04:41:29+05:30 IST

అరవై ఏళ్ల భుజంగరావు రేజర్‌తో గడ్డం గీస్తున్నాడు. గడ్డం కొద్దిగా తెగింది. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిరోజుల్లో గాయమైన దగ్గర ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడింది. యాంటీబయోటిక్‌ మందు లు వాడినా

 Infection  : పెద్ద ప్రాణాలకు ఇన్‌ఫెక్షన్‌!

భయపెడుతున్న ఔషధ నిరోధకత సమస్య

మొండికేస్తున్న సూక్ష్మజీవులు

ఔషధాలూ ప్రభావం చూపడం లేదు

చిన్నగాయం పెద్దదై ఇన్‌ఫెక్షన్‌తో మరణాలు

భవిష్యత్తులో మరిన్ని మరణాల ముప్పు!

హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు

అవగాహన మాత్రమే దీనికి మందు

గుంటూరు (మెడికల్‌), నవంబరు 21 : అరవై ఏళ్ల భుజంగరావు రేజర్‌తో గడ్డం గీస్తున్నాడు. గడ్డం కొద్దిగా తెగింది. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిరోజుల్లో గాయమైన దగ్గర ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడింది. యాంటీబయోటిక్‌ మందు లు వాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరిగి భుజంగరావు మృతి చెందాదు.

యాభై ఆరేళ్ల సుశీలకు చాలాకాలంగా మధుమేహం ఉంది. కాలికి స్వల్ప గాయమైంది. కొద్ది రోజుల్లో గాయమైన ప్రాంతంలో గ్యాంగ్రిన్‌ ఏర్పడింది. యాంటీ బయోటిక్‌ మందులు వాడినా అవి పెద్దగా ప్రభావం చూపలేదు. గ్యాంగ్రిన్‌ శరీరంలో ఇతర ప్రాంతాలకు పాకి సుశీల మృతి చెందింది.

హోటల్‌లో పనిచేసే సుందరం ఒంటిపై వేడినీళ్లు ఒలికాయి. శరీరంపై బొబ్బలు ఏర్పడ్డాయి. బజారులో దొరికే చౌకబారు పైపూత మందు కొని పూశాడు. కొద్ది రోజుల్లోనే బొబ్బల దగ్గర ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడింది. డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోయింది.. చికిత్స పొందుతూ సెప్టీసీమియాతో సుందరం మరణించాడు.

స్వల్పగాయాలే ప్రాణాంతకంగా మారే ఇలాంటి మరణాలను గురించి అడపాదడపా మనం వింటూనే ఉన్నాం. దీనికి యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనినే ఔషధ నిరోధకత అని వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించకపోతే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఊహకు అందనంతగా పెరిగిపోతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వల్పగాయాలు సైతం ప్రాణాలు తీసే ప్రమాదం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. చిన్న ఇన్‌ఫెక్షన్లు కూడా మందులకు లొంగని విధంగా మొండిగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం...ఏటా ఔషధ నిరోధకత కారణంగా 50 లక్షలమంది మృతి చెందుతున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. ఇంత తీవ్రమైన అంశంపై వైద్య సిబ్బందితో పాటు సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించి సమస్య తీవత్రను నియంత్రించేందుకు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ‘వరల్డ్‌ యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ వీక్‌’ (వాస్‌) నిర్వహిస్తున్నారు. అన్ని ప్రధానమైన ఆస్పత్రుల్లో పారామెడికల్‌ సిబ్బంది, వైద ్య విద్యార్థులతో పాటు సాధారణ రోగులు, వారి వెంట వచ్చే సహాయకులకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

మందులు దుర్వినియోగంతోనే తంటా!

యాంటీ బయోటిక్‌ మందులు విచ్చలవిడిగా, అవసరం ఉన్నా, లేకున్నా వినియోగించడం ఔషధ నిరోధకతకు ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు అవసరం లేకున్నా రోగులకు యాంటీ బయోటిక్‌ మందులు వాడుతున్నారు. రిటైల్‌ మెడికల్‌ దుకాణాల్లో డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా వీటిని విక్రయిస్తున్నారు. డ్రగ్‌ డిపార్టుమెంట్‌ వీటిని కట్టడి చేయాలని గుంటూరు వైద్య కళాశాల యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ కె.క్వీనీలీన తెలిపారు. సాధారణ వైద్య రంగంలో కంటే ఇతర పరిశ్రమల్లో యాంటీ బయోటిక్‌ మందుల దుర్వినియోగం అధికంగా ఉన్నదని జీఎంసీ ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ కె.శంకర్‌ అభిప్రాయపడ్డారు. పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్‌, ఫౌలీ్ట్ర పరిశ్రమల్లో విచ్చలవిడిగా, అవసరానికి మించి అధికంగా యాంటీ బయోటిక్‌ మందులు వాడుతున్నారు. వీటిపై సరైన నిఘా లేకపోవడంతో కట్టడి చర్యలు తీసుకోలేకపోతున్నార ని ఆయన వివరించారు.

పలు మందులకు ఔషధ నిరోధకత....

యాంటీ బయోటిక్‌ మందులను తట్టుకొని సూపర్‌ బగ్‌లుగా సూక్ష్మజీవులు మారడంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు దృష్టి సారించాయి. దీనిని నియంత్రించేందుకు పలు రకాల చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌కు(ఎన్‌సీడీసీ) అనుబంధంగా గుంటూరు వైద్య కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర విభాగంలో పరిశోధనలు సాగుతున్నాయి. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులకు శాస్త్రీయబద్ధంగా, యాంటీ బయోటిక్‌ రెసిస్టెన్స్‌కు ఆస్కారం ఏర్పడకుండా ‘కల్చర్‌ టెస్టులు’ చేస్తున్నారు. రోగుల రక్తం, మూత్రం, మలం, చర్మం, పస్‌ తదితర నమూనాలను పరీక్షించి వారి జబ్బుకు డ్రగ్‌ సెన్సిటివిటీని (ఏ మందు వాడితే సూక్ష్మజీవి నశిస్తుందో) తెలియజేస్తున్నారు. ఈ రిపోర్ట్‌ ఆధారంగా వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. నెలకు సుమారు 500 నమూనాలు ఇక్కడ పరీక్షిస్తున్నారు. ఈ వివరాలను ఢిల్లీలోని ఎన్‌సీడీసీకి పంపుతున్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌ కొనసాగుతోంది. ఇప్పటికే వ్యాంకోమైసిన్‌, మెథిసిలీన్‌ వంటి యాంటీ బయోటిక్‌ మందులకు ఔషధ నిరోధకత ఏర్పడినట్లు గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం వైద్యులు గుర్తించారు.

Updated Date - 2023-11-22T04:41:30+05:30 IST