వైద్యవిద్య ప్రవేశాల్లో.. ఈ ఏడాది కామన్‌ కౌన్సెలింగ్‌ లేనట్టే

ABN , First Publish Date - 2023-06-11T03:26:33+05:30 IST

ఎంబీబీఎస్‌, డెంటల్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల్లో ఈ ఏడాది కామన్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ నిర్వహించబోవడం లేదని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖకు రెండు రోజుల క్రితం స్పష్టతనిచ్చింది.

వైద్యవిద్య ప్రవేశాల్లో..   ఈ ఏడాది కామన్‌ కౌన్సెలింగ్‌ లేనట్టే

స్పష్టం చేసిన కేంద్రప్రభుత్వం

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, డెంటల్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల్లో ఈ ఏడాది కామన్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ నిర్వహించబోవడం లేదని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖకు రెండు రోజుల క్రితం స్పష్టతనిచ్చింది. వాస్తవానికి ఈ ఏడాది దేశవ్యాప్తంగా వైద్యవిద్య అడ్మిషన్ల ప్రక్రియను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని భావించింది. ఇప్పటి వరకు కేవలం ఆలిండియా కోటాకు చెందిన 15 శాతం సీట్లు, ఎయిమ్స్‌, జిప్‌మర్‌కు చెందిన సీట్ల కౌన్సిలింగ్‌ ప్రక్రియను మాత్రమే డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) చూస్తోంది. వీటితో పాటు రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే వైద్య కళాశాలల్లోని 85 శాతం సీట్లు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 100 శాతం సీట్లను కామన్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చిలో అన్ని రాష్ట్రప్రభుత్వాలకు డీజీహెచ్‌ఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. అతుల్‌ గోయల్‌ లేఖలు రాశారు. నోడల్‌ ఆఫీసర్స్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయితే ఈ కామన్‌ కౌన్సిలింగ్‌ విధానాన్ని తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడ్డాయి. దాంతో కేంద్రం వెనక్కు తగ్గింది.

Updated Date - 2023-06-11T03:26:33+05:30 IST