వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తలదించుకోవాల్సి వచ్చేది!
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:27 AM
గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను ఓడిపోవడం మంచిదే అని భావిస్తున్నా.
జగన్ మంత్రి పదవి ఇస్తామన్నారు
కానీ, షరతులు విధించడంతో వద్దన్నా
పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు
అధికారం శాశ్వతమని కొందరు పిచ్చోళ్ల భ్రమ
మాజీ మంత్రి దగ్గుబాటి వ్యాఖ్యలు
కారంచేడు(పర్చూరు), డిసెంబరు 25: ‘‘గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను ఓడిపోవడం మంచిదే అని భావిస్తున్నా. అప్పట్లో గెలిచి ఉంటే ఇప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలదించుకోవాల్సి వచ్చేది’’ అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. తన స్వగ్రామమైన బాపట్ల జిల్లా కారంచేడులో జరిగిన ఓ కార్యక్రమానికి సతీమణి, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరితో కలిసి దగ్గుబాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానికులు పలు సమస్యలను దగ్గుబాటికి చెప్పుకొని.. రోడ్ల దుస్థితిని కూడా తెలియజేశారు. ‘‘మీరు గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ గెలిపించుకోలేకపోయాం. అది మాకు కొంత బాధగా ఉంది’’ అని కొందరు వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన దగ్గుబాటి వైసీపీ ప్రభుత్వ తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘నేను గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది. గెలిచి ఉంటే తలెత్తుకుని తిరిగేవాడిని కాదు. అధికారం శాశ్వతం కాదని చరిత్ర చెబుతోంది. కానీ, అదే శాశ్వతమన్న భ్రమలో కొందరు పిచ్చోళ్లు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత నన్ను సీఎం జగన్ తన వద్దకు పిలిచి మాట్లాడారు. ఆ సందర్భంలో మా కుమారుడు హితేశ్ చెంచురామ్కు ఎమ్మెల్సీతోపాటు నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు. కొన్ని షరతులు విధించారు. దీంతో ఆ ప్రతిపాదనను నేను తిరస్కరించా. పదవుల కోసం పాకులాడే తత్వం మా కుటుంబానికి లేదు. ప్రజలకు సేవచేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. షరతులతో పదవులను ఆశించే తత్వం కూడా లేదు. ప్రస్తుత రాజకీయాలు ఒకరినొకరు దూషించుకునే విధంగా మారడం బాధాకరం. జీవించినంత కాలం మంచిగా ఉండాలన్నదే నా నైజం’’ అని దగ్గుబాటి అన్నారు.