Minister Peddireddy Fire : రాజీనామా చేస్తా.. నా పోస్టూ ఇచ్చేయండి!
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:17 AM
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె. పద్మా జనార్దన రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తప్పించింది. సదరన్ డిస్కమ్ సీఎండీ సంతో్షరావుకు ‘సెంట్రల్’ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీని వెనుక భారీ హైడ్రామా జరిగినట్లు సమాచారం.
సీపీడీసీఎల్ సీఎండీ కొనసాగింపు ప్రతిపాదనపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
ఎట్టకేలకు పద్మా జనార్దనరెడ్డి అవుట్
ఎస్పీడీసీఎల్ సీఎండీకి అదనపు బాధ్యతలు
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె. పద్మా జనార్దన రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తప్పించింది. సదరన్ డిస్కమ్ సీఎండీ సంతో్షరావుకు ‘సెంట్రల్’ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీని వెనుక భారీ హైడ్రామా జరిగినట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన పద్మా జనార్దన రెడ్డి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యజమాని విశ్వేశ్వర రెడ్డికి బంధువు. ఎంపీ అవినాశ్రెడ్డితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంటే... జగన్కు బాగా దగ్గర అని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలం సీపీడీసీఎల్ సీఎండీగా తానే ఉంటానని జనార్దన్ రెడ్డి సిబ్బందితో నిర్వహించే సమీక్షల్లో చెప్పేవారని సమాచారం. తొలుత రెండేళ్ల పదవీకాలానికి ఆయనను సీఎండీగా నియమించారు. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించారు. తాజాగా ఆయన పదవీ కాలం ఈ నెల 26వ తేదీతోనే ముగిసింది. దీంతో మరో రెండేళ్ల కాలానికి పద్మా జనార్దన్ రెడ్డినే సీఎండీగా కొనసాగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కానీ... విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇందుకు అంగీకరించలేదు. పద్మా జనార్దన్ రెడ్డిపై పలు ఆరోపణలు ఉండటం, సిబ్బంది ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే కారణం. దీంతో కొందరు అధికారులు మంత్రి వద్దకు వెళ్లి... ‘సార్... మీకు తెలుసు కదా! పద్మా జనార్దన రెడ్డి సీఎం గారికి కావాల్సిన వ్యక్తి. సీఎం గారు ఇంట్రెస్టెడ్’’ అని అన్నారు. కానీ... తాను ‘నాట్ ఇంట్రెస్టెడ్’ అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అయినా వినకుండా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించడంతో... ‘‘సరే ఒక పని చేయండి. నేను రాజీనామా చేస్తాను. ఈ పోస్టు కూడా ఇవ్వండి’’ అని మంత్రి మండిపడ్డారు. దీంతో అధికారులు సైలెంట్ అయిపోయారు. ఇంత జరిగినప్పటికీ... ఎలాగోలా మంత్రిని ఒప్పించి మళ్లీ సీఎండీ సీటులో కూర్చునేందుకు పద్మా జనార్దన రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పైగా... తిరుపతి కేంద్రంగా ఉన్న సదరన్ డిస్కమ్ సీఎండీ సంతోషరావును ఇన్చార్జిగా నియమించినప్పటికీ ఇప్పటికీ జనార్దన రెడ్డే చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
మోనార్క్ స్టైల్...
సీపీడీసీఎల్ సీఎండీగా జనార్డన రెడ్డి పూర్తిగా ‘మోనార్క్’ తరహాలో వ్యవహరించే వారనే ఆరోపణలున్నాయి. డిస్కమ్ ఉద్యోగులకు స్వేచ్ఛ పోయింది. ఎవరూ మొబైల్ ఫోన్లలో మాట్లాడకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయానికి వచ్చిన వెంటనే మొబైల్ ఫోన్లను సెక్యూరిటీ విభాగం వద్ద డిపాజిట్ చేయించారు. సిబ్బంది కదలికలపైనా నిఘా పెంచారు. ఈ వాతావరణంలో ఇమడలేమంటూ పలువురు ఇంజనీరింగ్ ఉద్యోగులు వాపోయేవారు.