Group-2 : ఎన్నికల వేళ... గ్రూప్-2 వల!
ABN , First Publish Date - 2023-12-08T02:40:24+05:30 IST
ఉద్యోగాలు భర్తీ చేయకుండా నాలుగున్నరేళ్లు మొద్దునిద్ర పోయిన వైసీపీ ప్రభుత్వం... సరిగ్గా ఎన్నికల సమయానికి నోటిఫికేషన్ల పేరిట హడావుడి మొదలుపెట్టింది.
897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జగన్ ప్రభుత్వంలో ఇదే మొదటి ప్రకటన
ఎన్నికల ముందు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్
ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నిర్ణయం
21 నుంచి జనవరి 10 వరకూ దరఖాస్తులు
ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష
ఆఫ్లైన్లో.. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహణ
మెయిన్స్ పరీక్ష తేదీలపై తర్వాతే నిర్ణయం
అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు భర్తీ చేయకుండా నాలుగున్నరేళ్లు మొద్దునిద్ర పోయిన వైసీపీ ప్రభుత్వం... సరిగ్గా ఎన్నికల సమయానికి నోటిఫికేషన్ల పేరిట హడావుడి మొదలుపెట్టింది. ఏటా జనవరి 1న జాబ్ కేలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఒక్క ఏడాది కూడా దాన్ని విడుదల చేయలేదు. నిరుద్యోగుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో వెయ్యి పోస్టులు భర్తీ చేస్తామని గత మే నెలలో ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కూడా నెలల తరబడి తాత్సారం చేసి తీరిగ్గా ఎన్నికలకు వెళ్లబోయే ముందు 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 21నుంచి జనవరి 10 వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 25న స్ర్కీనింగ్ టెస్ట్(ప్రిలిమినరీ పరీక్ష) జరుగుతుందని తెలిపింది. అనంతరం మెయిన్స్ పరీక్షల తేదీని ప్రకటిస్తామని, మెయిన్స్లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షలోనూ అర్హత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో ఆఫ్లైన్లో జరుగుతుందని, మెయిన్స్ పరీక్ష ఆబ్జెక్టివ్తో పాటు రాతపూర్వక ప్రశ్నలతో ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షను ఆఫ్లైన్, ఆన్లైన్ ఎలా నిర్వహించాలనేది తర్వాత నిర్ణయిస్తామని వివరించింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రిలిమినరీ పరీక్ష జరిగేలా షెడ్యూలును రూపొందించడాన్ని బట్టి ఇందులోనూ వైసీపీ సర్కారు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది.
పోస్టుల వివరాలు...
ఎగ్జిక్యూటివ్లో... డిప్యూటీ తహసీల్దారు పోస్టులు 114, ఎక్సైజ్ ఎస్ఐ 150, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28, గ్రేడ్-2 సబ్ రిజిస్ర్టార్ 16, కోఆపరేటివ్ సొసైటీల్లో అసిస్టెంట్ రిజిస్ర్టార్ 16, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ 4, పంచాయతీరాజ్లో ఈవో 2, చేనేతలో అసిస్టెంట్ డెవల్పమెంట్ ఆఫీసర్ ఒకటి పోస్టులున్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్లో... జీఏడీలో ఏఎస్వో 218, ఆర్థిక శాఖలో ఏఎ్సవో 23, న్యాయశాఖలో ఏఎస్వో 15, లెజిస్లేచర్ సెక్రటేరియట్లో ఏఎ్సవో 15, పే అండ్ అకౌంట్స్లో ఆడిటర్ 10, ట్రెజరీ్సలో సీనియర్ అంకౌంటెంట్ 12, జూనియర్ అకౌంటెంట్ 22, ఏపీపీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్ 22, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో జూనియర్ అసిస్టెంట్ 32, పౌరసరఫరాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ 13, సీసీఎల్ఏలో జూనియర్ అసిస్టెంట్ 31, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో జూనియర్ అసిస్టెంట్ 12, ప్రభుత్వ పరీక్షల విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 20, ఇతరత్రా శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కాగా, ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు (భారతదేశ చరిత్ర- 30, జాగ్రఫీ 30, ఇండియన్ సొసైటీ- 30, కరెంట్ అఫైర్స్- 30, మెంటల్ ఎబిలిటీ- 30) ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. మొదటి పేపర్లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర 75 మార్కులు, భారత రాజ్యాంగం 75 మార్కులకు ఉంటుంది. రెండో పేపర్ భారత, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 30 మార్కులు, బీసీలకు 35, ఓసీలకు 40 మార్కులు అర్హతగా నిర్ణయించారు.
నాలుగున్నరేళ్లుగా మోసం
జాబ్ కేలెండర్ ఇవ్వకుండా నాలుగున్నరేళ్ల పాటు ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేసినందుకే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిందని, దీంతో ఎన్నికల స్టంట్లో భాగంగా ఇప్పుడు హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఎన్నిచేసినా మోసపోయిన నిరుద్యోగులు 2024 ఎన్నికల్లో వైసీపీని నమ్మబోరని స్పష్టం చేశారు.