భక్తుల కానుకలు ధార్మిక కార్యక్రమాలకే
ABN , First Publish Date - 2023-12-03T03:48:49+05:30 IST
భక్తులు హుండీలో సమర్పిస్తున్న కానుకలను దేవాలయాల్లో ధూపదీప నిర్వహణ, నూతన నిర్మాణాలు, ధర్మ ప్రచారం తదితరాల కోసమే వినియోగించాలని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.
ఏపీలో వైసీపీని ఓడిస్తారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
తిరుమల/రేణిగుంట, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): భక్తులు హుండీలో సమర్పిస్తున్న కానుకలను దేవాలయాల్లో ధూపదీప నిర్వహణ, నూతన నిర్మాణాలు, ధర్మ ప్రచారం తదితరాల కోసమే వినియోగించాలని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో టీటీడీ ఇటీవల నిర్మించిన పార్వేట మండపాన్ని, తొలగించిన పాత మండపం స్తంభాలను స్థానిక బీజేపీ నేత భానుప్రకా్షరెడ్డితో కలిసి పరిశీలించానన్నారు. పుర్వీకులు నిర్మించిన కట్టడాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీటీడీ బోర్డు కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పురావస్తు శాఖ ప్రమేయంతో పార్వేటమండపం నిర్మాణం తొలగింపు జరిగిందా లేదా అనే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని కోరారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో ఉచితాలతో దోపిడీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఏపీలోనూ రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని బటన్ నొక్కి ఓడిస్తారు’ అని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. కేంద్ర నిధులను సక్రమంగా వినియోగించడంలో ఆంధ్ర, తెలంగాణ పాలకులు ఇష్టానుసారంగా ప్రజలకు ఉచితాలు పంపిణీ చేస్తూ.. రాష్ట్రాలను అధోగతి పాలు చేశారని మండిపడ్డారు.