బెజవాడ నుంచి షిర్డీకి.. నేటి నుంచే ఇండి‘గో’ నాన్స్టాప్ సర్వీసు
ABN , First Publish Date - 2023-03-26T03:35:50+05:30 IST
బెజవాడ నుంచి దేశీయంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీకి తొలి విమాన సర్వీసు ఆదివారం ప్రారంభమవుతోంది.
మధ్యాహ్నం 12.25 గంటలకు డిపార్చర్
తొలిరోజు హౌస్ఫుల్.. రోజూ విమాన రాకపోకలు
విజయవాడ/గన్నవరం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): బెజవాడ నుంచి దేశీయంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీకి తొలి విమాన సర్వీసు ఆదివారం ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం 12.25 గంటలకు విజయవాడ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఏటీఆర్ విమానం షిర్టీకి బయలుదేరనుంది. గన్నవరం విమానాశ్రయంలో లాంఛనంగా ఈ సర్వీసును ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ నాన్స్టాప్ సర్వీసులు నడుస్తాయి. మధ్యాహ్నం 12.25 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరితే షిర్టీకి 3 గంటలకు చేరుకుంటుంది. అదే సమయంలో షిర్టీలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి విజయవాడకు 4.45 గంటల కల్లా చేరుకుంటుంది. దాదాపు నెల రోజుల నుంచే బుకింగ్కు శ్రీకారం చుట్టగా, తొలిరోజు ఆదివారం ప్రారంభం కానున్న విమాన సర్వీసు హౌస్ ఫుల్(78 సీట్ల కెపాసిటీ) అయింది. విజయవాడ నుంచి షిర్టీకి సగటున రూ.10 వేల టికెట్ ధరగా ఉంది. మూడు నెలల ముందుగా బుక్ చేసుకుంటే ధర తగ్గుతుంది. డైనమిక్ ప్రైజింగ్ విధానంలో రూ.15 వేలు ఆపైన కూడా ధర పలుకుతోంది.