అమరావతిపై తుగ్లక్ నిర్ణయానికి నాలుగేళ్లు: రామకృష్ణ
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:00 AM
ఏపీ రాజధాని అమరావతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి నేటికి నాలుగేళ్లు నిండిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో విమర్శించారు.
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి నేటికి నాలుగేళ్లు నిండిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో విమర్శించారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే దుష్ట తలంపుతో జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆయన ధ్వజమెత్తారు. సుమారు రూ.10 వేల కోట్లతో అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. జగన్ తుగ్లక్ నిర్ణయంతో ఆందోళన చెందిన రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. అమరావతి రాజధాని ఉద్యమంపై జగన్ సర్కార్ కక్షగట్టి అక్రమ అరెస్టులు, బెదిరింపులు, జైళ్లకు పంపడం వంటి కుయుక్తులు పన్నినా అక్కడి రైతులు, మహిళలు బెదరలేదన్నారు. ఇటీవల పార్లమెంట్ సాక్షిగా అమరావతే ఏపీ రాజధానిగా కేంద్రం స్పష్టం చేసిందని, అమరావతి మాస్టర్ప్లాన్ను ఆమోదించినట్లు పేర్కొందని రామకృష్ణ తెలిపారు.