జోనల్ వ్యవస్థపై తుది దశలో కసరత్తు: బొత్స
ABN , First Publish Date - 2023-07-21T03:10:58+05:30 IST
: రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జోనల్ వ్యవస్థపై కసరత్తు తుది దశలో ఉందని చెప్పారు.
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జోనల్ వ్యవస్థపై కసరత్తు తుది దశలో ఉందని చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. జోనల్ వ్యవస్థపై ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సీఎస్ సంప్రదింపులు జరుపుతారన్నారు. కొవిడ్, ఇతరత్రా కారణాలతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. 2014 జూన్ నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో కటాఫ్ డేట్ను మార్చే అంశం చర్చలో ఉందన్నారు. త్వరలో మార్గదర్శకాలు ఇచ్చి, ఆగస్టు 7న జీవో ఇస్తామని ప్రకటించారు. కాగా, ‘‘వలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఏది చేసినా.. ప్రభుత్వానిదే బాధ్యత’’ అని బొత్స అన్నారు.