Share News

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:08 AM

అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్‌ కాలువకు సాగు నీరు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ విడపనకల్లు మండల రైతులు శనివారం ఆందోళనకు దిగారు.

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

జీబీసీకి నీరిచ్చి పంటలను కాపాడాలని డిమాండ్‌

అధికారులు స్పందించకపోవడంతో తహసీల్దారు కార్యాలయానికి తాళం

విడపనకల్లు, డిసెంబరు 16: అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్‌ కాలువకు సాగు నీరు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ విడపనకల్లు మండల రైతులు శనివారం ఆందోళనకు దిగారు. వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న రైతులు జీబీసీ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. జీబీసీకి నీరు నిలిచిపోయి పది రోజులు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు ఎప్పుడిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు, తహసీల్దారు కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం బళ్లారి-అనంతపురం రహదారిపై రాస్తారోకోకు దిగారు. జీబీసీ కాలువ కింద 50 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలును సాగు చేశామని, ఒక్క మిర్చి పంటే 25 వేల ఎకరాల్లో సాగులో ఉంది అన్నారు. ఇప్పటికే 15 రోజుల నుంచి నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంట దక్కకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సాగునీరు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో జీబీసీ అధికారులు, తహసీల్దారు వీరమ్మ, ఉరవకొండ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. ఆర్డీఓ, కలెక్టర్‌తో చర్చించి రెండు రోజుల్లో సాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనకు టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు.

Updated Date - Dec 17 , 2023 | 05:09 AM