ఉద్యోగుల సమావేశం రసాభాస
ABN , First Publish Date - 2023-11-20T04:04:17+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం ఏడో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.

సంఘం అధ్యక్షుడిపై సభ్యుల తిరుగుబాటు
12 అంశాలకు ఏకగ్రీవంగా వ్యతిరేకం
విజయవాడ, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం ఏడో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సంఘ అధ్యక్షుడు సుబ్బరాజుకు వ్యతిరేకంగా సభ్యులు స్వరం వినిపించారు. అధ్యక్షుడు ప్రవేశపెట్టే తీర్మానాలను వ్యతిరేకించాలని నిర్ణయించి ‘నో టూ రిజల్యూషన్స్’ బ్యాడ్జీలు ధరించి వచ్చారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ, సంఘంలో సభ్యులుగా ఉన్నవారంతా హాజరయ్యారు. అక్కడకు ప్రత్యేక బస్సుల్లో వచ్చిన సంఘంలో సభ్యులు కానివారిని వెనక్కు పంపేశారు. సుబ్బరాజు ప్రసంగాన్ని సభ్యులు అడ్డుకొని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కో-ఆపరేటివ్ డైరెక్టర్ సతీశ్ అజెండాను చదువుతుండగా సభ్యులు అడ్డుకున్నారు. ఆయన నియామకాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారని సుబ్బరాజును నిలదీశారు. ఈ సమావేశంలో మొత్తం 13 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించడానికి ఓటింగ్ నిర్వహించారు. ఇందులో వార్షిక బడ్జెట్కు సంబంధించిన అంశాన్ని మాత్రమే సభ్యులంతా ఆమోదించారు. మిగిలిన 12 అంశాలను ఏకగ్రీవంగా వ్యతిరేకించారు.