క్షయ నివారణలో ఏలూరుకు స్వర్ణం

ABN , First Publish Date - 2023-03-26T03:36:43+05:30 IST

క్షయవ్యాధి నివారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ఎనిమిది జాతీయ అవార్డులను సొంత చేసుకుందని ఆరోగ్యశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

క్షయ నివారణలో ఏలూరుకు స్వర్ణం

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధి నివారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ఎనిమిది జాతీయ అవార్డులను సొంత చేసుకుందని ఆరోగ్యశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారాణసిలో నిర్వహించిన ప్రపంచ క్షయ నివారణ సదస్సులో ఈ అవార్డులను అందుకున్నట్లు ఆయన తెలిపారు. క్షయ రహిత జిల్లాలను తీర్చిదిద్దడంలో అధికారులు చేసిన కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ అవార్డులు అందించినట్లు పేర్కొన్నారు. కాగా, దేశంలో 337 జిల్లాల్లో క్షయ నివారణ కార్యక్రమాలు అమలు చేస్తుండగా.. 18 జిల్లాలకు స్వర్ణపతకాలు, 28 జిల్లాలకు రజతం, 65 జిల్లాలకు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. మన రాష్ట్రం నుంచి ఏలూరు జిల్లాకు స్వర్ణ పతకం లభించింది. విశాఖపట్నం, కోనసీమ జిల్లాలు రజతం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు కాంస్య పతకాలను సాధించాయి. 2015-22 మధ్య ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను అందించారు. అధికార యంత్రాగాన్ని ఆరోగ్యశాఖ కమిషనర్‌ జె.నివాస్‌ అభినందించారు.

Updated Date - 2023-03-26T03:36:43+05:30 IST