కట్టుదిట్టమైన భద్రత నడుమ టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీకట్టుదిట్టమైన భద్రత నడుమ టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:12 AM
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
జగన్ ఫొటో ముద్రించడంపై విపక్షాల నిరసన
తిరుపతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులకు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గురువారం తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటిపట్టాల ప్రొసీడింగ్స్లో శ్రీవారి ఫొటోతో సమానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను ముద్రించడంపై విపక్షాలు మండిపడ్డాయి. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని టీడీపీ, జనసేన నేతలు బుధవారం హెచ్చరించిన నేపథ్యంలో విపక్ష నేతలను ముందుగా గృహనిర్బంధం చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మహతి ఆడిటోరియం చుట్టూ పోలీసు వలయాన్ని ఏర్పాటుచేశారు. జగన్ ఫొటో ఉన్న ప్రొసీడింగ్స్నే ఉద్యోగులకు అందజేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అలిపిరి వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గతంలో పలుసార్లు ఉద్యోగులకు పట్టాలను అందించిన టీటీడీ.. ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలనూ ముద్రించలేదన్నారు. ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరి శ్రీవారి ఫొటోతో పాటు జగన్ రెడ్డి ఫొటోలు వేసుకోవడం సిగ్గుచేటన్నారు. అలిపిరి వద్ద బీజేపీ నేతలు భానుప్రకాశ్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ తదితరులు నిరసన వ్యక్తం చేశారు.