ఓట్ల కోసమే దళిత క్రైస్తవుల బిల్లు
ABN , First Publish Date - 2023-03-26T04:26:32+05:30 IST
‘‘చంద్రబాబు ఎప్పుడో చేసిన పెళ్లికి జగన్ ఇప్పుడు కొత్తగా మేళం వాయిస్తున్నారు.
టీడీపీ నేతలు నక్కా ఆనంద్బాబు, బీటీ నాయుడు
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబు ఎప్పుడో చేసిన పెళ్లికి జగన్ ఇప్పుడు కొత్తగా మేళం వాయిస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో దళిత క్రైస్తవుల ఓట్లు దండుకోవడానికే’’ అని టీడీపీ నేతలు నక్కా ఆనంద్బాబు, బీటీ నాయుడు విమర్శించారు. చంద్రబాబు 2019లోనే దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తూ అసెంబ్లీలో బిల్లుని ఆమోదించి కేంద్రానికి పంపితే.. జగన్ మళ్లీ దాన్నే తిరిగి పంపడం దళితుల్ని వంచించడం కాదా? అని ప్రశ్నించారు. శనివారం వారు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుదెబ్బ తగలబట్టే జగన్కు దళిత క్రైస్తవులు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. తల్లి, చెల్లి, బావ చేతికి బైబిల్ ఇచ్చి రోడ్లపైకి పంపిన జగన్.. తాను మాత్రం హిందూ మఠాధిపతుల చుట్టూ తిరుగుతూ.. దళిత క్రైస్తవులను ఉద్ధరిస్తున్నట్లు చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారో కనిపెట్టడానికి కోడింగ్ అమలు చేశామన్న సజ్జల వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని వైసీపీపైన, జగన్మోహన్రెడ్డిపైన తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.