Share News

కోర్టు ధిక్కరణ.. ఇద్దరు ఐఏఎ్‌సలకు జైలు శిక్ష

ABN , First Publish Date - 2023-11-29T04:01:35+05:30 IST

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది.

కోర్టు ధిక్కరణ.. ఇద్దరు ఐఏఎ్‌సలకు జైలు శిక్ష

శ్యామలరావు, పోలా భాస్కర్‌కు

జరిమానా కూడా విధించిన హైకోర్టు

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. డిసెంబరు 8లోగా రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) ముందు లొంగిపోవాలని ఇద్దరినీ ఆదేశించింది. అనంతరం వారిని జైలుకు పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు మంగళవారం ఆదేశాలిచ్చారు. కోర్టును ఆశ్రయించిన అన్‌-ఎయిడెడ్‌ లెక్చరర్లతో ఖాళీ ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ నిరుడు జూలై 26న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలుకాకపోవడంతో తెనాలి జెఎమ్‌జె మహిళా కళాశాలలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న కేపీ సైనీ, మరికొందరు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. కోర్టు ఉత్తర్వులను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో శ్యామలరావు, పోలా భాస్కర్‌కు జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2023-11-29T04:01:36+05:30 IST