ప్రతి జిల్లాకు కేంద్రం సాయం అందించింది
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:51 AM
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జిల్లాకు సాయం అందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
పర్యాటకాభివృద్ధికి రాజమండ్రి-లంబసింగి హైవే
కేంద్ర నిధులనే జగన్ పంచుతున్నాడు: పురందేశ్వరి
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 27: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి జిల్లాకు సాయం అందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన పురందేశ్వరి రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పథకాలపై ఆనాడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ వారి వారి స్టికర్లు వేసుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పఽథకాల పేర్లను మారిస్తే సహించేదిలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజమహేంద్రవరంలో వైద్య కళాశాల, ఈఎ్సఐ హాస్పిటల్, మోరంపూడి ప్లైఓవర్ నిర్మిస్తోందని చెప్పారు. సంక్షేమ పథకాలకు సంబంఽధించి కేంద్రం ఇచ్చే డబ్బులకు జగన్ బటన్ నొక్కి పంచుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తుంటే దారుణంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాగునీటి సమస్యలను తీర్చేందుకు కేంద్ర జల్జీవన్ మిషన్ కింద 6 వేల కొళాయి కనెక్షన్లు ఇచ్చిందన్నారు. టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నుంచి లంబసింగి వరకు రహదారి నిర్మిస్తున్నామని చెప్పారు. బీజేపీని రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదించాలని విజ్ఞప్తి చేశారు.