Share News

కర్నూలు మెడికల్‌ కళాశాలలో గంజాయి కలకలం

ABN , First Publish Date - 2023-11-22T04:39:10+05:30 IST

కర్నూలు మెడికల్‌ కళాశాల మెన్స్‌ హాస్టల్‌లో గంజాయి పట్టుబడటం మంగళవారం కలకలం రేపింది. మెడికోలు ఇటీవల మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ నెల 17,

కర్నూలు మెడికల్‌ కళాశాలలో గంజాయి కలకలం

హాస్టల్‌లో నలుగురు విద్యార్థుల వద్ద గుర్తింపు

హాస్టల్‌, వైద్యాధికారుల తనిఖీల్లో వెలుగులోకి

కర్నూలు (హాస్పిటల్‌), నవంబరు 21: కర్నూలు మెడికల్‌ కళాశాల మెన్స్‌ హాస్టల్‌లో గంజాయి పట్టుబడటం మంగళవారం కలకలం రేపింది. మెడికోలు ఇటీవల మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ నెల 17, 18వ తేదీల్లో హాస్టల్‌ డిప్యూటీ వార్డెన్‌, అసిస్టెంట్‌ వార్డెన్‌లు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ గదిలో నలుగురు వైద్య విద్యార్థులు మద్యం సేవిస్తూ గంజాయి తాగుతూ కనిపించారు. వారిలో ఇద్దరు విద్యార్థుల పాత్ర ప్రధానంగా ఉన్నట్లు తెలిసింది. గంజాయిని పొడిచేసి దాన్ని పొగ రూపంలో తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. గంజాయి ఘటన వెలుగులోకి రావడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించిన ప్రిన్సిపాల్‌, అధికారులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కాగా, దీనిపై ప్రిన్సిపాల్‌ ముగ్గురితో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సభ్యులు మంగళవారం మెన్స్‌ హాస్టల్‌లో విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు ఇచ్చారంటూ విద్యార్థులను ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీ చరిత్రలో మొదటిసారిగా మాదకద్రవ్యాలు పట్టుబడటం.. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-11-22T04:39:11+05:30 IST