కేంద్ర మంత్రి చెప్పినా నమ్మరా?: బుగ్గన

ABN , First Publish Date - 2023-08-04T03:18:15+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన గణాంకాలను కూడా నమ్మకపోతే ఎలా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన

కేంద్ర మంత్రి చెప్పినా నమ్మరా?: బుగ్గన

అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన గణాంకాలను కూడా నమ్మకపోతే ఎలా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో కంటే తక్కువ అప్పులే చేస్తున్నామని తెలిపారు. 2019 మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.4,42,442 కోట్లకు చేరినట్టు నిర్మలా సీతారామన్‌ చెప్పారన్నారు. దీని ప్రకారం తమ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని బుగ్గన చెప్పుకొచ్చారు. టీడీపీ పాలించిన ఐదేళ్లలో రాష్ట్ర జీఎ్‌సడీపీ సగటున రూ.6 లక్షల కోట్ల పైచిలుకు ఉండగా, తమ హయాంలో జీఎ్‌సడీపీ సగటు రూ.11 లక్షల కోట్లు ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఆదాయం కంటే తమ హయాంలో ఆదాయం పెరిగిందని, ఇదంతా సంపద సృష్టేనని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పుల గురించి మాట్లాడకుండా ఇప్పుడు తమ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారని, రాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పరిమితికి మించి అప్పులు చేశారని, తాము వాటిని తిరిగి కట్టామన్నారు.

Updated Date - 2023-08-04T03:18:15+05:30 IST