నంద్యాల జిల్లాలో బాంబుల కలకలం
ABN , First Publish Date - 2023-07-26T02:33:33+05:30 IST
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నాటు బాంబులు కలకలం రేపాయి.
ముచ్చుమర్రిలో వైసీపీ నేత ఇంట 21 నాటుబాంబులు
శుభ్రం చేయడానికి నీటిట్యాంక్ మూత తీస్తే మూటలు
మూటల్లో బాంబులు చూసి బెంబేలెత్తిన స్థానికులు
శాప్ చైర్మన్ సిద్దార్థరెడ్డికి ఆ నేత అనుచరుడు
నందికొట్కూరు/ పగిడ్యాల, జూలై 25: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నాటు బాంబులు కలకలం రేపాయి. స్థానిక వైసీపీ నాయకుడి ఇంట్లో ఈ బాంబులు బయటపడ్డాయి. నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు, వైసీపీ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ ఆశన్నగారి మధు పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో నివశిస్తున్నారు. ఆయన ఇంట్లో మంగళవారం 21 నాటు బాంబులు లభ్యమయ్యాయి. మధు ఇంటిపైభాగంలో ఉన్న నీటి ట్యాంకులో ఈ బాంబులను ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంచారు. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకును శుభ్రం చేసేందుకు మధు వెళ్లాడు. ట్యాంక్ మూత ఓపెన్ చేసి చూస్తే... ఏదో వస్తువు చుట్టచుట్టిన మూడు కవర్లను మధు గమనించారు. వాటిని బయటకు తీసి చూడగా, అనుమానం రావడంతో అదే కాలనీలో నివసిస్తున్న ఆయన బంధువు మద్దిలేటిని పిలిపించి చూపించారు. ఆయన ఇవి నాటు బాంబుల్లా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయమని మధుకు చెప్పడంతో ముచ్చుమర్రి పోలీస్టేషన్లో ఎస్ఐ నాగార్జునకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ కవర్లలో ఉన్నవి నాటు బాంబులుగా గుర్తించి పట్టణ సీఐ విజయభాస్కర్కు తెలియజేశారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాంబు స్వ్కాడ్, డాగ్స్వ్కాడ్లు సంఘటన స్థలాన్ని పరిశీలించాయి. స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు ముచ్చుమర్రి పోలీస్టేషన్కు తీసుకెళ్లారు. అసలు ఈ బాంబుల ప్యాకెట్లు తన వాటర్ ట్యాంకులోకి ఎలా వచ్చాయో విచారించి తనకు న్యాయం చేయాలని మధు....పోలీసులను కోరారు. కాగా, ముచ్చుమర్రి గ్రామంపై దశాబ్దాల కాలంగా ఫ్యాక్షన్ ప్రభావం ఉంది. ఇది బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్వగ్రామం కావడం, ఆయనకు సన్నిహితంగా ఉన్న మధు ఇంటిలో నాటు బాంబులు లభ్యం కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.