పథకాల వర్తింపులో పక్షపాతమా?
ABN , First Publish Date - 2023-03-26T04:18:22+05:30 IST
‘‘అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించడంలోనూ రాజకీయంగా వ్యవహరిస్తున్నారు.
అధికార పార్టీ వారికే గృహాలు మంజూరు
ఎమ్మెల్యే కిరణ్ను నిలదీసిన జనసేన నేత
జి.సిగడాం, మార్చి 25: ‘‘అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించడంలోనూ రాజకీయంగా వ్యవహరిస్తున్నారు. పథకాల వర్తింపులోనూ పక్షపాతమేనా?’’ అంటూ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ను జనసేన స్థానిక నాయకుడు మీసాల రవికుమార్ ప్రశ్నించారు. ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నిద్దాం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ‘‘అధికార పార్టీకి చెందిన వారికే గృహాలు మంజూరు చేస్తున్నారు. ప్రతిపక్షం వారిపై పక్షపాతం చూపిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల్లోనూ అన్యాయం చేస్తున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో రాజకీయ జోక్యం ఎందుకు?’’ అంటూ ఎమ్మెల్యే కిరణ్కుమార్ను నిలదీశారు. పథకాలకు రాజకీయ రంగు పులమడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయని, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాలకులకు ప్రజా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే కిరణ్కుమార్ స్పందిస్తూ.. అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తామని, త్వరలో రహదారుల నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు.