నేరస్తులకు శిక్షలు వేయించడంలో భేష్
ABN , Publish Date - Dec 17 , 2023 | 05:13 AM
మహిళలు, చిన్నపిల్లలపై నేరాలకు పాల్పడిన వారికి మరణ దండన, యావజ్జీవ శిక్షలు పడేలా పని చేసిన ప్రతి పోలీసును అభినందిస్తున్నా.
ఏడాదిలో 165 కేసుల్లో 100ు శిక్షలు పడ్డాయి
మహిళల జోలికి వస్తే ఎవరైనా వదలొద్దు
ఫ్రెండ్లీ పోలీసింగ్ మరింత పెరగాలి: డీజీపీ
అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘మహిళలు, చిన్నపిల్లలపై నేరాలకు పాల్పడిన వారికి మరణ దండన, యావజ్జీవ శిక్షలు పడేలా పని చేసిన ప్రతి పోలీసును అభినందిస్తున్నా. చిన్న చిన్న కేసులతో పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగే 1.22 లక్షల మందికి లోక్ అదాలత్ ద్వారా ఒకే రోజు విముక్తి కల్పించేందుకు కృషి చేసిన మీ పనితీరుతో సంతృప్తి చెందుతున్నా. కానీ ప్రజలతో ఫ్రెండ్లీ పోలిసింగ్ బాగా పెరగాలి’ అని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. విజయవాడ, విశాఖపట్నం పోలీసు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్క్వార్టర్స్లో శాంతి భద్రతలపై సమీక్షించారు. మహిళల జోలికి ఎంతటి వ్యక్తులు వచ్చినా వదిలి పెట్టొద్దని జిల్లాల ఎస్పీలకు సూచించారు. గత ఏడాది జూన్ నుంచి రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసుల్లో శిక్షల శాతం 30 నుంచి ఏకంగా 67కు పెరగడం శుభసూచకమని అన్నారు. ఏడాదిలో జరిగిన తీవ్రమైన నేరాల్లో 165 కేసుల్లో శిక్షలు పడితే అందులో ఏడుగురికి మరణ శిక్షలు పడటం గొప్ప విషయం అన్నారు. మరో 57 కేసుల్లో నిందితులకు యావజ్జీవ శిక్షలు పడి శాశ్వతంగా జైలుపాలు అయ్యారని, వంద శాతం శిక్షలు పడటం పోలీసుల పనితీరుకు నిదర్శనం అన్నారు. ‘సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున మీ జిల్లాల్లో పనిచేస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లను పొరుగు జిల్లాలకు పంపించండి’ అంటూ డీజీపీ అధికారులను ఆదేశించారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్లో ప్రతిభ చూపిన 77 మంది పోలీసుల్ని డీజీపీ అభినందించారు. మొత్తం 15 మంది ఎస్పీలకు స్వర్ణ, ఐదుగురు డీఎస్పీలకు రజత, 56 మంది కానిస్టేబుళ్లకు కాంస్య పతకాలు అందజేశారు.