ఆరుగురు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు
ABN , Publish Date - Dec 30 , 2023 | 02:35 AM
తిరుపతి జిల్లాలో ఆరుగురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏర్పేడు సీఐ శ్రీహరి కథనం మేరకు..
ఆరుగురు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు
ఏర్పేడు, డిసెంబరు 29: తిరుపతి జిల్లాలో ఆరుగురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏర్పేడు సీఐ శ్రీహరి కథనం మేరకు.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సెప్టెంబరు 12న ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఉన్న టీసీఎల్ పరిశ్రమ సమీపంలో టీడీపీ నాయకులు ధర్నా చేశారు. ఆ సమయంలో ట్రాక్టర్ నడుపుకుంటూ స్వగ్రామానికి వస్తుండగా, ట్రాక్టర్ పక్కకు పెట్టాలంటూ టీడీపీ సీనియర్ నాయకుడు పేరం ధనంజయులునాయుడు తనను కులం పేరుతో దూషించినట్లు వికృతమాల దళితవాడకు చెందిన గురునాథం ఫిర్యాదు చేశాడు. అయితే కేసు నమోదు చేయకపోవడంతో గురునాథం శ్రీకాళహస్తి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ధనంజయులు నాయుడు, చిరంజీవులు నాయుడు, నాగరాజ నాయుడు, మల్లికార్జున నాయుడు, నిరంజన బాబు నాయుడు, హేమాక్షిపై శుక్రవారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. కాగా, సెప్టెంబరు 12న తాను కుటుంబ సభ్యులతో షిరిడీ దర్శనానికి వెళ్లానని, తనపై కేసు ఎలా పెడతారని ధనంజయులు నాయుడు చెప్పారు. అసలు గురునాథం ఎవరో తనకు తెలియదన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి ఒత్తిడితో ఇప్పటికే పోలీసులు తనపై తొమ్మిది తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.