పిండమార్పిడి పద్ధతిలో తొలి సాహివాల్ దూడ జననం
ABN , First Publish Date - 2023-06-26T03:40:49+05:30 IST
రాష్ట్రంలో తొలిసారిగా పిండమార్పిడి పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ పెయ్యదూడ పురుడు పోసుకుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
పెయ్యకు పద్మావతిగా నామకరణం: ధర్మారెడ్డి
తిరుపతి(విద్య), జూన్ 25: రాష్ట్రంలో తొలిసారిగా పిండమార్పిడి పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ పెయ్యదూడ పురుడు పోసుకుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ సంయుక్తంగా దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేసేందుకు గత ఏడాదిలో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మేలు రకమైన దేశవాళీ గోజాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గోసంరక్షణ శాలలోని మేలుజాతి ఆవులనుంచి అండాలు సేకరించి.. ఎస్వీ వెటర్నరీవర్సిటీలోని ఐవీఎఫ్ ప్రయోగశాలలో కృత్రిమంగా పిండాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ పిండాలను టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే తొలిసారిగా సరోగసి ద్వారా సాహివాల్ ఆవుదూడను పుట్టించి విజయం సాధించినట్లు వివరించారు. ఆ దూడకు పద్మావతి అని నామకరణం చేశామని చెప్పారు. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, పిండమార్పిడి చేసిన ఆవులలో ఇప్పటివరకు 11 ఆవులు గర్భం దాల్చాయన్నారు. ఈ పద్ధతిలో రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేస్తామన్నారు.