దూసుకొచ్చిన మృత్యువు
ABN , First Publish Date - 2023-01-13T03:30:38+05:30 IST
దూసుకొచ్చిన మృత్యువు
ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టిప్పర్ ఢీకొని రైతు సహా ముగ్గురి దుర్మరణం
జమ్మలమడుగు రూరల్, జనవరి 12: వైఎస్సార్ కడపజిల్లా జమ్మలమడుగు మండలంలోని ధర్మాపురం వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మలమడుగు వైపు నుంచి బయల్దేరిన టిప్పర్ రోడ్డు పక్కన భోజనం చేసేందుకు కూర్చున్న వారిపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్తో పాటు రైతు, రైతు కూలీ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. ధర్మాపురానికి చెందిన రైతు యనమల నాగసుబ్బారెడ్డి(63)కి ఊరికి సమీపంలోనే జాతీయ రహదారికి ఆనుకుని పొలం ఉంది. పొలం దున్నడానికి గురువారం గొరిగెనూరుకు చెందిన రైతు కూలీ ఇనగనూరు ఓబులేసు (50)ను వెంట పెట్టుకుని వెళ్లాడు. ఉదయం ఏడుగంటల నుంచి 9.30గంటల వరకు పనిచేసి ఆపారు. ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తినేందుకు నాగసుబ్బారెడ్డి, ఓబులేసు రోడ్డుపైకి ఎక్కి ఒక చివర కూర్చుని గిన్నెలు చేతుల్లోకి తీసుకున్నారు. ఇంతలో జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న ఖాళీ టిప్పర్ అదుపు తప్పి అతివేగంతో వీరిపై నుంచి దూసుకుపోయి పొలంలో బోల్తాపడింది. ఈ ఘటనలో నాగసుబ్బారెడ్డి, ఓబులేసు శరీరాలు ముక్కలు ముక్కలైపోయి అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్.ఉప్పలపాడుకు చెందిన టిప్పర్ డ్రైవర్ విజయ్కుమార్ (55) కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రొద్దుటూరు ఆర్టీవో సుశీల, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తదితరులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. బాధితులకు న్యాయం చేయాలని మృతుని బంధువులు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బాధితులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష, టీడీపీ ఇన్చార్జి దేవగుడి భూపేశ్రెడ్డి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు అందించారు. సీఐ సదాశివయ్య మాట్లాడుతూ.. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా, బ్రేక్ ఫెయిల్ అయిందా, డ్రైవర్కు ఆరోగ్యం సరిగా లేదా, అతివేగమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు.