వాన లోటు.. సాగు లేటు!
ABN , First Publish Date - 2023-06-26T03:35:35+05:30 IST
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా వాన లోటు ఏర్పడింది.
చిత్తూరు జిల్లాలోనే సాధారణ వర్షం.. ఎనిమిది జిల్లాల్లో తీవ్ర వర్షాభావం.. మిగతా జిల్లాల్లోనూ తక్కువే
రాష్ట్రంలో 52ు తగ్గిన వర్షపాతం
మూడు వారాల్లో 3 శాతం మించని పంటలు
మందకొడిగా ఖరీఫ్ సేద్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా వాన లోటు ఏర్పడింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే సాధారణ వర్షాలు పడగా, 17 జిల్లాల్లో సాధారణం కంటే చాలా తక్కువగా వర్షాలు కురిశాయి. 8 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు గత రెండు వారాల్లో ఏపీ మినహా దేశంలోని చాలా రాష్ట్రాలకు బాగా విస్తరించాయి. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలు కూడా వచ్చాయి. కానీ రాష్ట్రానికి రుతు పవనాలు మూడు వారాలు ఆలస్యంగా విస్తరించాయి. వాస్తవంగా జూన్1నే కేరళకు రావాల్సిన రుతు పవనాలు వారం రోజులపైగా ఆలస్యం అయ్యాయి. దాంతో రాయలసీమ రావటానికే జాప్యం జరిగింది. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 52ు వాన లోటు కనిపిస్తోంది. నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే కాస్త తక్కువ వర్షాలు పడ్డాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో 75ు లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొంది. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి, విజయనగరం, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో 50ు పైగా లోటు ఉంది. రుతు పవనాల విస్తరణలో జాప్యం వల్ల ఈ జిల్లాల్లో తొలకరి జల్లులకు రైతులు వేసిన పశుగ్రాస పంటలు, పచ్చిరొట్ట పైర్లు, నువ్వులు వంటి తొలకరి పంటలు ఎండలకు మాడిపోయాయి. పైగా ఎండలు, వడగాల్పులతో ప్రజలు అతలాకుతలమయ్యారు. ఇప్పుడు రుతు పవనాలు విస్తరించినా.. వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనా లేదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటు వర్ష పాతంలో నాలుగు శాతం లోటు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇన్నాళ్లకు విస్తరించిన రుతుపవనాలతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న అంచనా లేదు. ప్రస్తుత ఖరీ్ఫలో పంటల సాగుపై వాన ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖరీ్ఫలో 85.98 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటిలో ఇప్పటికే 5లక్షల ఎకరాల్లో విత్తనం పడాల్సి ఉండగా, కేవలం రెండున్నర లక్షల ఎకరాల్లోనే వరి, వేరుశనగ, పత్తి వంటి పంటలు సాగులోకి వచ్చాయని అధికారులు చెబున్నారు. సగటున మూడు శాతమే ఖరీఫ్ పంటలు సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఖరీఫ్ సాగులో పక్షం రోజుల ఆలస్యం కొనసాగుతోంది. ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించిన రుతు పవనాలతో వర్షాలు విస్తారంగా కురిస్తేనే సాగు పుంజుకునే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.