‘అమ్మఒడి’లో భారీ కోత!
ABN , First Publish Date - 2023-06-26T02:55:19+05:30 IST
అమ్మఒడి పథకంలో ఈ ఏడాది ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే కొత్త జాబితాలో 1,34,437 మంది తగ్గిపోయారు.
ఏడాదిలో 1.34 లక్షల మందికి కట్
ఈసారి 42,61,965 మందికే లబ్ధి
ఈ ప్రభుత్వంలో ఇదే చివరిసారి
ఐదేళ్లలో నాలుగు విడతలే చెల్లింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అమ్మఒడి పథకంలో ఈ ఏడాది ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే కొత్త జాబితాలో 1,34,437 మంది తగ్గిపోయారు. 2022 జూన్లో 43,96,402 మంది తల్లులకు అమ్మఒడి లబ్ధి చేకూరింది. ఆ సంఖ్య ఇప్పుడు 42,61,965కు పడిపోయింది. వివిధ కారణాలతో ఈ మేరకు కోత పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏటా చదువుకునే పిల్లల సంఖ్యలో ఎంతో కొంత వృద్ధి ఉంటుంది. 2021-22 విద్యా సంవత్సరంలో 82,31,502 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర మేనేజ్మెంట్లలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివారు. వారి తల్లులు 43,96,402 మందికి గతేడాది జూన్లో అమ్మఒడి నగదు వేశారు. 2022-23లో చదివిన విద్యార్థులకు ఇప్పుడు నగదు వేయబోతున్నారు. అయితే వారి సంఖ్య కూడా తగ్గిన దాఖలాలు లేవు. డ్రాపౌట్లు చాలా తక్కువని ప్రభుత్వ మే చెబుతోంది. 75శాతం హాజరు కూడా దాదాపుగా అందరికీ ఉంది. అమ్మఒడి పథకం ప్రభుత్వంతో పాటు ప్రైవేటుకూ వర్తిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి అవకాశం లేదు. కానీ విచిత్రంగా 1.34 లక్షల మంది లబ్ధిదారులు జాబితాల్లో కనిపించకుండా పోయారు. బ్యాంకు ఖాతాలు ఎన్పీసీఐతో లింకు కాలేదనే కారణంతో చాలామందిని అనర్హుల జాబితాలో చూపించినట్లు తెలుస్తోంది. వారంతా నేషనల్ పేమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లింకు చేసుకోవాలని లేదా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని వలంటీర్లు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందింది. రేషన్ కార్డులోని ఆరు దశల వాలిడేషన్ అమ్మఒడికి అర్హతగా ఉంది. వేసవిలో విద్యుత్ వాడకం పెరిగిన నేపథ్యంలో యూనిట్లు పెరిగి కోత పెట్టారేమోనన్న అనుమనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ మూడుసార్లు అమ్మఒడి నగదు తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు నాలుగోసారి ఇస్తున్నారు. మళ్లీ వచ్చే ఏడాది జూన్లోనే ఈ పథకం అమలుకావాలి. కానీ ఆలోగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నాలుగుసార్లే అమ్మఒడి ఇచ్చినట్లు అవుతుంది.
జిల్లాల వారీగా లబ్ధిదారులు
అల్లూరి సీతారామరాజు 1,01,170, అనకాపల్లి 1,50,870, అనంతపురం 2,13,394, అన్నమయ్య 1,52,366, బాపట్ల 1,17,827, చిత్తూరు 1,52,542, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 1,38,833, తూర్పుగోదావరి 1,55,768, ఏలూరు 1,72,956, గుంటూరు 1,59,594, కాకినాడ 1,86,708, కృష్ణా 1,29,533, కర్నూలు 2,42,241, నంద్యాల 1,67,084, ఎన్టీఆర్ 1,70,587, పల్నాడు 1,87,417, పార్వతీపురం మన్యం 83,733, ప్రకాశం 2,03,663, నెల్లూరు 1,94,842, శ్రీసత్యసాయి 1,60,397, శ్రీకాకుళం 1,91,689, తిరుపతి 1,68,367, విశాఖపట్నం 1,70,467, విజయనగరం 1,66,180, పశ్చిమగోదావరి 1,43,534, కడప 1,80,203.