జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు కన్నుమూత

ABN , First Publish Date - 2023-06-26T03:50:00+05:30 IST

జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) విజయవాడలో ఆదివారం రాత్రి కన్నుమూశారు.

జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు కన్నుమూత

విజయవాడ (వన్‌టౌన్‌), జూన్‌ 25: జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) విజయవాడలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో చికిత్ప నిమిత్తం ఒక ప్రైవేటు ఆసుత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల సీఎం జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వెలిబుచ్చారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విజయవాడ ప్రెస్‌క్లబ్‌, అమరావతి ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయవాడ బావాజీపేటలోని ఆయన నివాసం నుంచి సోమవారం అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఐజేయూ) స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ సలహాదారుడిగా ఆయన సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసి అన్ని జిల్లాల్లో యూనియన్‌ను విస్తరింపజేశారు. ఏపీ న్యూస్‌ పేపర్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా నాన్‌ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు జర్నలిస్టు నాయకులు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-26T03:50:00+05:30 IST