గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
ABN , First Publish Date - 2023-05-26T03:35:02+05:30 IST
నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం చల్లటి కబురు అందించింది.

త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని జగన్ ఆదేశాలు
వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సుమారు వెయ్యికి పైగా పోస్టు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జరిగిన సమీక్షలో పోస్టుల వివరాలను సీఎంకు ఉన్నతాధికారులు అందించారు. పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. గ్రూప్-1కు సంబంధించి సుమారు 100కు పైగా పోస్టులు, గ్రూప్-2కి సంబంధించి సుమారు 900కి పైగా పోస్టులు భర్తీ చేయనున్నామని వివరించారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సూచించారు.